Covid-19: ఆర్ధిక సంక్షోభం నుంచి గ‌ట్టెక్కాలంటే

11 Jun, 2021 09:59 IST|Sakshi

దేశంలో ఆర్ధిక సంక్షోభం 

మ‌రింత దిగ‌జారుతున్న పేద‌రికం 

ఉపాధి క‌ల్పించాల‌ని ఆర్ధిక వేత్త‌ల అభిప్రాయం 

న్యూఢిల్లీ: నోబ‌ల్ బ‌హుమతి అవార్డ్ గ్ర‌హిత, ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెన‌ర్జీ క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల్ని ఆదుకునేలా ప‌లు సూచ‌న‌లిస్తున్నారు. దేశ ఆర్ధిక స్థితిగ‌తులపై ఆయ‌న మాట్లాడుతూ.. మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎన్నో కుటుంబాలు దారిద్య్రరేఖ దిగువకు వెళ్లిపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూ ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. లేదంటే దేశాభివృద్ధికి తీవ్రన‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని అభిజిత్  వ్యాఖ్యానించారు.

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారితో సంభవించిన ఆర్ధిక సంక్షోభం నుంచి పేద‌ల్ని ర‌క్షించాలంటే ప్ర‌భుత్వ  ప్ర‌ధాన ప‌థ‌కాల ద్వారా ప‌ని దినాల సంఖ్యను 100 నుంచి 150 రోజుల‌కు పెంచాల‌ని అభిజిత్ బెన‌ర్జీ తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కింద‌ కనీసం 100 రోజుల నుంచి 150 రోజుల పాటు ఉపాధి ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రత క‌ల్పించ‌వ‌చ్చ‌న్నారు.  కానీ ఇది ప్ర‌జ‌లు సాధార‌ణ స్థితికి చేరుకునేందుకు స‌హాయ ప‌డ‌దనే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.  దీంతో పాటు "కార్మికులు పనిచేసే హోటల్, తయారీ, నిర్మాణ రంగాలు త్వరగా పునరుద్ధరించబడితే  పరిస్థితి మెరుగుపడవచ్చు" అన్నారు. భారతదేశంలో నగదు బదిలీ కార్యక్రమాలను ఇతర దేశాలతో పోల్చి చూస్తే అమెరికాలో చాలా మంది నిరుద్యోగులు వారానికి 600 డాలర్లు న‌గ‌దు పొందుతున్నార‌ని, ఫ్రాన్స్‌లో ఉద్యోగం కోల్పోయిన ప్రతిఒక్కరికీ ప్రభుత్వం మద్దతు ఇస్తోందని చెప్పారు.  

కాగా, గత సంవత్సరం మహమ్మారి కారణంగా 230 మిలియన్ల మంది భారతీయులు పేదరికంలో పడిపోయిన‌ట్లు చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ పేద‌రికం మ‌రింతగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని  బెంగళూరుకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ  యూనివ‌ర్సిటీ తెలిపింది. గత మార్చి నుండి నెలరోజుల లాక్డౌన్ సుమారు 100 మిలియన్ల మంది ఉపాది కోల్పోయార‌ని, ఈ సంవత్సరం చివరినాటికి 15 శాతం మంది ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అధ్యయనం తెలిపింది.

వారి రుణాలు రద్దు చేయాలి : అభిజిత్ బెనర్జీ


 

మరిన్ని వార్తలు