మార్కెట్ లోకి ల్యాప్‌టాప్‌లు తీసుకొస్తున్న నోకియా

30 Nov, 2020 15:34 IST|Sakshi

ఒకప్పుడు ఫీచర్‌ ఫోన్ల విభాగంలో టాప్ కంపెనీగా పేరొందిన నోకియా సంస్థ నుంచి ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు రానున్నాయి. గతంలో మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది నోకియా. కానీ తర్వాత మార్కెట్ లో పోటీ దృష్ట్యా తిరోగమనాన్ని చూసింది. నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన చివరి మినీ ల్యాప్‌టాప్ నోకియా బుక్‌లెట్ 3జీ ఇది 2009లో వచ్చింది. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దింతో మన దేశంలో తిరిగి అధికారికంగా ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు సమాచారం.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!)

టిప్‌స్టర్ ముకుల్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, నోకియా ల్యాప్‌టాప్‌లు ఒకే సిరీస్ కింద తొమ్మిది వేర్వేరు మోడళ్లలో రానున్నాయి. ఈ మోడళ్లు వచ్చేసి NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL41S, NKi310UL42S, NKi310UL82S, NKi310UL85S. ఈ ల్యాప్‌టాప్‌లకు సర్టిఫికేషన్ ఇచ్చినట్టు BIS వెబ్‌సైట్లో కనిపిస్తోంది. కానీ దీనికి సంబంధించిన అధికారిక సమాచాన్ని నోకియా వెల్లడించలేదు. త్వరలోనే ఈ మోడళ్లు మార్కెట్లోకి రానున్నాయని నోకియామోబ్ వెబ్‌సైట్ తెలిపింది. ఇందులో ఐ5 ప్రాసెసర్‌తో ఐదు ల్యాప్‌టాప్ మోడళ్లను, i3 చిప్‌సెట్‌తో నాలుగు మోడళ్లను రూపొందించనట్లు అంచనా.

ఈ పేర్లలో యుఎల్‌కు ముందు 10వ సంఖ్య ఉన్నందున ఈ ల్యాప్‌టాప్‌లు విండోస్ 10తో నడవనున్నాయి. మోడల్ నంబర్లలో మొదటి రెండు అక్షరాలైన ఎన్ కేలు- నోకియా బ్రాండ్‌ను సూచిస్తున్నాయి. తరువాతి అక్షరాలైన ఐ5, ఐ3లు ప్రాసెసర్‌ను సూచిస్తున్నాయి. బిఐఎస్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం నోకియా ల్యాప్‌టాప్‌లను చైనా కంపెనీ అయిన టోంగ్‌ఫాంగ్ లిమిటెడ్ తయారు చేసింది. నోకియా ఈ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేయడంపై అధికారిక ప్రకటన చేయలేదు. 

>
మరిన్ని వార్తలు