సోషల్‌ మీడియా ప్రమోషన్లకు కొత్త నిబంధనలు

8 Sep, 2022 06:42 IST|Sakshi

బ్రాండ్‌తో అనుబంధాన్ని ముందే వెల్లడించాలి

పెయిడ్‌ ప్రమోషన్‌ అని ప్రకటించాల్సిందే

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వివిధ ఉత్పత్తులు, సేవల విషయమై వినియోగదారులను ప్రభావితం చేసేలా వ్యవహరించే వారికి (ప్రభావ శీలురు) కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఏదైనా ఉత్పత్తికి వారు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అయితే ఆ విషయాన్ని బయటకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేయనుంది. ఏవి చేయాలి? ఏవి చేయకూడదు? అనే వివరాలు కొత్త నిబంధనల్లో పొందుపరచనున్నట్టు అధిక వర్గాలు వెల్లడించాయి. వచ్చే రెండు వారాల్లో వీటిని విడుదల చేయవచ్చని పేర్కొన్నాయి.

ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల ద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేసే వారు మనదేశంలో వేల సంఖ్యలో ఉన్నారు. వివిధ అంశాలపై వీరు పోస్ట్‌లు పెట్టడంతోపాటు వీడియోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని బ్రాండ్ల నుంచి డబ్బులు తీసుకుని అనుకూల ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం యూజర్లలో కొద్ది మందికే తెలుసు. తాము చూసే వీడియో ఫలానా బ్రాండ్‌కు ప్రమోషన్‌ అని యూజర్లకు తెలిసేలా చేసి, లాభ, నష్టాలపై అవగాహన కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అధికార వర్గా­లు వెల్లడించాయి. పోస్ట్‌లు, వీడియోల్లో ఫలానా బ్రాండ్‌కు ఇది పెయిడ్‌ ప్రమోషన్‌ అని ముందే వెల్లడించాలని కొత్త నిబంధనలు నిర్ధేశించనున్నాయి.
  

మరిన్ని వార్తలు