Nostalgia: పది వేలకే బజాజ్‌ చేతక్‌.. ఎప్పుడంటే ..

18 Jul, 2021 12:20 IST|Sakshi

హెడ్డింగ్‌ చూసి నమ్మలేకపోతున్నారా ? కానీ ఇది నిజం ! ఒక్క బజాజే కాదు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, రాజ్‌దూత్‌, షెవర్లెట్‌, అంబాసిడర్‌ అన్ని కార్ల ధరలు అగ్గువే !?. బైకులైతే పది వేలకు అటు ఇటు కార్లయితే ఇరవై నుంచి ముప్పే వేల రూపాయలు. అయితే ఈ ధరలన్నీ ఇప్పటి కావు. ఆర్థిక సంస్కరణలు దేశంలో అడుగు పెట్టడానికి ముందు స్వాతంత్రం తర్వాత కాలానికి చెందినవి. ఆ రోజుల్లో వాహనాల ధరలు ఎలా ఉన్నాయి. వాటిని ఆయా కంపెనీలు ఎలా ప్రమోట్‌ చేశాయి, అప్పటి పన్నుల వివరాలు సరదాగా ఓ సారి చూద్దాం. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో బజాజ్‌ది ప్రత్యేక స్థానం. నైన్‌టీస్‌లో బజాజ్‌  అమ్మకాల్లో చేతక్‌ స్కూటరే నంబర్‌ వన్‌. అయితే బైక్‌ల క్రేజ్‌ పెరగడంతో క్రమంగా స్కూటర్ల మార్కెట్‌ డౌన్‌ అయ్యింది. చేతక్‌ కూడా వెనుకపడి పోయింది. అయితే ఇప్పుడు కొంగొత్తగా బజాల్‌ చేతక్‌ ఈవీ అంటూ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లోకి వస్తోంది. అయితే 1987లో బజాజ్‌ చేతక్‌ మార్కెటోకి వచ్చినప్పుడు దాని ధర రూ. 10,652 మాత్రమే. స్కూటర్‌ ధర తక్కువగా చూపించేందుకు పన్ను తక్కువగా ఉండే పాండిచ్చేరి ఎక్స్‌షోరూం ధరను పేర్కొంది బజాజ్‌.

బజాజ్‌ వెస్పా స్కూటర్‌ అన్ని పన్నులతో కలుపుకుని కేవలం 2,129 మనకు వచ్చేది. ఆ ధరకు కొనాలంటే మనం టైం మిషన్లో 1961కి వెళ్లాలి. ఇక ఇదే స్కూటర్‌కి వెనుక సీటు, స్పేర్‌ వీల్‌ , ట్యూబ్‌ కావాలంటే అదనంగా మరో రూ. 114 చెల్లిస్తే సరి.

ఇప్పుడంటే డౌన్‌పేమెంట్‌ కట్టి ఈఎంఐలకి వెళ్లడం సాధారణ విషయంగా మారింది. కానీ 80ల్లో అదేంతో కష్టమైన పని. 80వ దశకంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా వచ్చిన రాజ్‌దూత్‌ తన అమ్మకాలు పెంచుకునేందుకు ఈఎంఐని ప్రవేశపెట్టింది. కేవలం రూ. 3,500 కడితే చాలు బండి మీ సొంతం అంటూ ప్రకటనలు గుప్పించింది. 

మైలేజీ రావాలంటే 100 సీసీ నుంచి 125 సీసీ, పవర్‌ కావాలంటే 150 సీసీ నుంచి 350 సీసీ బైకులు ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. కానీ 1963లోనే ఏకంగా 750 సీసీ ఇంజన్‌తో బైకును మార్కెట్‌లోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తెచ్చింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్‌ సెప్టార్‌ పేరుతో వచ్చిన బైక్‌ ఆ రోజుల్లో ఓ సంచలనం.

దేశీ వాహన తయారీ కంపెనీల్లో మహీంద్రా అండ్‌ మహీంద్రాని ప్రత్యేక స్థానం. పదిహేనేళ్ల కిందటి వరకు కూడా రూరల్‌ ఇండియా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో మహీంద్రా జీపులది ప్రత్యేక స్థానం. అయితే 1960 మహీంద్రా జీపు ధర కేవలం రూ. 12,421 మాత్రమే. అంతేకాదు ఆ రోజుల్లో అమ్మకాలు పెంచేందుకు రూ. 200 డిస్కౌంట్‌ కూడా ప్రకటించింది.

జనరల్‌ మోటార్స్‌ వారి షెవర్లేట్‌ కారుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. అందరికీ సుపరిచితమైన బ్రాండ్‌. స్వాతంత్రానికి పూర్వం షెవర్లెట్‌ కారును కలిగి ఉండటం స్టేటస్‌ సింబల్‌గా ఉండేది. ఈ రోజుల్లో రచయితలు తమ కథనాయకుడు, నాయికల ఎంత ధనవంతులో వర్ణించేందుకు షెవర్లెట్‌ పేరును తరచుగా ఉపయోగించేవారు. 1936లో షెవర్లెట్‌ కారు ధర రూ.3,675. ఈ ధరకు ఇప్పుడు కారు టైరు కూడా రావడం లేదు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు అత్యధికంగా ఉపయోగించిన కారు అంబాసిడర్‌. ఆ తర్వాత పద్మినీ ప్రీమియర్‌, స్టాండర్డ్‌ హెరాల్డ్‌లు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్‌ మోటార్స్‌ తయారు చేసిన ఈ కార్లు ఇంచుమించు 2000 వరకు ఇండియా రోడ్లపై తమ ఆధిపత్యం చూపించాయి. 1972లో ఆ కార్ల ధరలు ఎలా ఉన్నాయో ఈ లుక్కేయ్యండి.

కార్లకు ఇప్పుడైతే ఎక్సైజ్‌ డ్యూటీ కారు ఇంజన్‌ కెపాసిటీని బట్టి 12.50 శాతం నుంచి 30 శాతం వరకు వసూలు చేస్తున్నారు. 1963లో స్టాండర్డ్‌ కంపానియన్‌ కారు ధర రూ. 12,635 అయితే ఎక్సైజ్‌ డ్యూటీ కేవలం రూ. 333 మాత్రమే.

 

ఇప్పుడీ పాత జ్ఙాపకాలన్నీ ఎందుకు తెరపైకి వచ్చాయంటే....  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్​ మహీంద్రా ఫియట్​ కారుకు సంబంధించిన పేపర్​ యాడ్​ను ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఆ యాడ్​లో ఫియట్​ కారు ధర రూ.9,800లుగా ఉంది. ఆహ్​ !  ద గుడ్​ ఓల్డ్​ డేస్​ అంటూ కామెంట్​ పెట్టారు. ఆనంద్​ మహీంద్రా ట్వీట్​కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. తమ అనుభవాలను కూడా షేర్​ చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు