అంతకు మించిన బాధ ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు - ఎలన్‌మస్క్‌

12 Feb, 2022 13:31 IST|Sakshi

పర్సనల్‌ విషయాలు బయటపెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు టెస్లా ఓనర్‌ ఎలన్‌మస్క్‌. కానీ తన జీవితంలో చోటు చేసుకున్న ఓ విషాధ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇటీవల వెలుగు చూశాయి. టెస్లా మోడల్‌ ఎస్‌ కారును వేగంగా నడిపిస్తూ ఓ ప్రమాదంలో చిక్కుకుని చనిపోయారు ఇద​‍్దరు అమెరికన్‌ టీనేజర్లు. 2018 మే 10న బారెట్‌రిలే, ఎడ్గర్‌మాన్‌సెరాట్‌ అనే ఇద్దరు టీజేజర్లు గంటకు 116 మైళ్ల వేగంతో మోడల్‌ ఎస్‌ కారును డ్రైవ్‌ చేస్తుండగా కారు క్రాష్‌ అయ్యింది. వెంటనే మంటలు చెలరేగి ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు.  

ఈ ప్రమదానికి సంబంధించి బారెట్‌రిలే తండ్రి జేమ్స్‌రిలేకి పలు ఈ మెయిళ్లు పంపారు ఎలన్‌మస్క్‌. అందులో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను ఎలన్‌మస్క్‌ ప్రస్తావించాడు. 2008లో ఎలన్‌మస్క్‌ మొదటి సంతానం నెవడా అలెగ్జాండర్‌ మస్క్‌ అనారోగ్యంతో చనిపోయాడు. ఆ విషయాలను ఎలన్‌మస్క్‌ ప్రస్తావిస్తూ... పది వారాల వయస్సున్నప్పుడు నెవడా నా చేతిలోనే చనిపోయాడు. వాడు ఆఖరి శ్వాస తీసుకోవడం నేను చూశాను. నా చేతిలో ఉన్నప్పుడే వాడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. మన కళ్ల ముందే పిల్లలు చని పోవడం కంటే పెద్ద బాధ ఈ ప్రపంచంలో మరేమీ ఉండదు అంటూ తన బాధని పంచుకున్నారు.

ఈ రోడ్డు ప్రమాదం తర్వాత టెస్లా కారులో భద్రతపరమైన ఫీచర్లు పెంచారు ఎలన్‌మస్క్‌, మొబైల్‌ యాప్‌ ద్వారా కారు స్పీడును తల్లిదండ్రులు కంట్రోల్‌ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ప్రమాదం జరిగిన కొద్ది కాలం తర్వాత టెస్లా కంపెనీకి వ్యతిరేకంగా మృతుల కుటుంబ సభ్యులు కోర్టులో కేసు నమోదు చేశారు. టెస్లా కారులో ఉన్న భద్రతపరమైన లోపాల కారణంగానే ప్రమాదం చోటు చేసుకుందని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. టెస్లా ఆటోపైలెట్‌పై అనేక సందేహాలు చుట్టుముట్టిన తరుణంలో ఈ కేసు వార్తల్లోకి రావడం ఎలన్‌మస్క్‌కి ఇబ్బందిగా మారింది.

చదవండి:ఎలన్‌ మస్క్‌ నిజంగా ఓ పిచ్చోడు’.. ఇజ్జత్‌ తీసిపారేసిన టీనేజర్‌

మరిన్ని వార్తలు