బ్యాడ్‌ నవంబర్‌.. అచ్చిరాని పండుగ సీజన్‌! 19 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయి డౌన్‌ఫాల్‌

13 Dec, 2021 08:01 IST|Sakshi

November 2021 Record Lowest wholesales In automobile industry Due To Chip Shortage: ఆటోమొబైల్‌ రంగంలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ప్రతికూల పరిస్థితులు నడుస్తున్నాయి ఇప్పుడు.  దాదాపు పదకొండేళ్ల తర్వాత ఒక నెలలో ద్విచక్ర వాహనాలు రికార్డు స్థాయిలో తక్కువగా అమ్ముడుపోవడం విశేషం. అంతేకాదు దాదాపు ఏడేళ్ల తర్వాత ప్యాసింజర్‌ వెహికిల్స్‌ అమ్మకాల్లోనూ ఇదే ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.  


2021 నవంబర్‌ నెల ఆటోమొబైల్‌ రంగానికి అచ్చి రాలేదు. ఓవైపు పండుగ సీజన్‌ కొనసాగినా.. ఊహించినంత వాహన అమ్మకాలు లేకపోవడం విశేషం. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫ్యాక్చురర్స్‌ (SIAM) నివేదికల ప్రకారం నవంబర్‌ నెలలో.. ప్యాసింజర్‌ వెహికిల్‌ అమ్మకాల మొత్తం 18.6 శాతం పడిపోయింది. అదే విధంగా టూ వీలర్స్‌ ఏకంగా 34 శాతం తగ్గింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ డౌన్‌ఫాల్‌ దారుణంగా నమోదు అయ్యింది. 

ప్యాసింజర్‌ వెహికిల్స్‌ ఈ నవంబర్‌లో  2, 15, 626 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 2, 64, 898గా ఉంది. ఇక ఉత్పత్తి కూడా 9.5 శాతం పడిపోయింది (2,94,596 యూనిట్ల నుంచి 2,66,552కి).

టూ వీలర్స్‌ ఈ నవంబర్‌లో 10, 50, 616 యూనిట్లు మాత్రమే సేల్‌ అయ్యాయి. కిందటి ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య 16 లక్షల యూనిట్లకు పైనే ఉంది. ఇక ఉత్పత్తి కూడా 29 శాతం పడిపోయి.. పదకొండేళ్ల తర్వాత పతనం నమోదు చేసుకుంది. 19, 36, 793 యూనిట్లకు గానూ 13, 67, 701 యూనిట్లను ఉత్పత్తి పడిపోయింది. 

ఇక త్రీ వీలర్స్ విషయానికొస్తే.. ఈ నవంబర్‌లో 6.64 శాతం క్షీణత కనిపిస్తోంది. 22, 471 యూనిట్లు అమ్ముడుపోగా.. కిందటి ఏడాది ఆ సంఖ్య 24, 071 యూనిట్లుగా ఉంది. ఉ‍త్పత్తి మాత్రం 6 శాతం పడిపోయింది. 65, 460 యూనిట్ల నుంచి 61, 451 యూనిట్లకు పడిపోయింది. 

పెరిగిన ఎగుమతి.. 

అమ్మకాల సంగతి ఎలా ఉన్నా.. ఎగుమతుల విషయంలో మాత్రం కంపెనీలు అస్సలు తగ్గట్లేదు. మొత్తంగా ఈ మూడు కేటగిరీలను పరిశీలిస్తే..  ప్యాసింజర్‌ వెహికిల్స్‌లో 15.5 శాతం పెరుగుదల (44, 265 యూనిట్లు), టూ వీలర్స్‌లో 9 శాతం (3, 56, 659 యూనిట్లు), త్రీ వీలర్స్‌లో 14 శాతం (42, 431 యూనిట్లు) ఎగుమతి శాతం పెరిగింది.

 

కారణం.. 
సెమీ కండక్టర్ల కొరత. కరోనా సమయంలో చిప్‌ ఉత్పత్తి ఫ్యాక్టరీలు మూతపడి.. ఈ ప్రభావం ఏడాది తర్వాత కూడా వెంటాడుతోంది. చిప్‌ల సమస్య కారణంగా ఉత్పత్తి.. డెలివరీలు దెబ్బతింటోంది. మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. అయితే నవంబర్‌లో అదీ పండుగ సీజన్‌లో ఈ రేంజ్‌ ప్రతికూల ప్రభావం చూడడం 19 ఏళ్లలో ఇదే తొలిసారి అని సియామ్‌(SIAM) డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ చెప్తున్నారు. ముఖ్యంగా త్రీ వీలర్స్‌ అమ్మకాలు మరీ దారుణంగా ఉన్నాయని చెప్తున్నారాయన.

చదవండి:  గూగుల్‌, యాపిల్‌ను తలదన్నే రేంజ్‌ ప్లాన్‌.. 17 బిలియన్‌ డాలర్లతో చిప్‌ ఫ్యాక్టరీ

మరిన్ని వార్తలు