గూగుల్ మ్యాప్స్ లో మరో సరికొత్త ఫీచర్

20 Nov, 2020 10:02 IST|Sakshi

కోవిడ్ - 19 వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడ జనాలు అక్కడే ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ప్రయాణాలు లేకపోవడంతో మ్యాపింగ్, నావిగేషన్ సేవల వినియోగం చాలా తగ్గింది. గూగుల్ మ్యాప్స్ ఈ సమయంలో తన సేవలను మెరుగు పరుచుకుంది. అంతే కాదు, ఈ వ్యాది మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 250 కొత్త ఫీచర్స్ ని తీసుకొచ్చింది గూగుల్. 

తాజాగా, గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాన్సిట్ “క్రౌడ్నెస్(జనసమూహం)” డేటా అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణిచాలనుకుంటున్న దారిలో ప్రజారవాణాకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంటే బస్సులు, రైళ్లు మరియు సబ్‌వే వంటి వాటిలో ఎక్కువ మంది ఎందులో ప్రయాణిస్తున్నారనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది. దాని వల్ల మీరు మరో ప్రత్యామ్నాయం మార్గంలో ప్రయాణించొచ్చు. ఈ సమాచారం అంతా మీకు గూగుల్ మ్యాప్స్ లో ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్, వారి లైవ్ స్టేటస్ ఆధారంగా తెలియజేస్తునట్లు గూగుల్ తెలిపింది. ఈ సమాచారం ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలలో లభిస్తుంది కావున అన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండకపోచ్చని తెలిపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది పనిచేస్తుందని వెల్లడించింది.(చదవండి: గూగుల్ పే యూజర్లకు డెబిట్ కార్డులు)

మరో ముఖ్యవిషయం ఏమిటంటే మ్యాప్స్ ద్వారా ఆహార పంపిణీ(ఫుడ్ డెలివరీ)కి అనుకూలమైన కేంద్రంగా మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, భారత్‌లలో ఫుడ్‌ డెలివరీ లైవ్‌ స్టేటస్‌, డెలివరీకి పట్టే సమయం, డెలివరీ ఛార్జీలు వంటి వివరాలను మ్యాప్స్ చూపిస్తున్నట్టు పేర్కొంది. కొద్ది రోజుల్లో ఈ ఫీచర్స్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.
 

మరిన్ని వార్తలు