డిజిటల్‌ గోల్డ్‌ సేవలకు చెక్‌

26 Aug, 2021 02:36 IST|Sakshi

సెప్టెంబర్‌ 10 నుంచి అమల్లోకి

స్టాక్‌ బ్రోకర్లు, సభ్యులు నిబంధనలు పాటించాల్సిందే

ఎన్‌ఎస్‌ఈ ఆదేశాలు

న్యూఢిల్లీ: స్టాక్‌ బ్రోకర్లు, సభ్యులు డిజిటల్‌ గోల్డ్‌ విక్రయించకుండా నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ నిషేధం విధించింది. సెప్టెంబర్‌ 10 నాటికి తమ ప్లాట్‌ఫామ్‌లపై డిజిటల్‌ గోల్డ్‌ విక్రయాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. కొందరు సభ్యులు తమ క్లయింట్లకు డిజిటల్‌ గోల్డ్‌ కొనుగోళ్లు, విక్రయాలకు వీలుగా వేదికలను అందుబాటులో ఉంచుతున్నట్టు గుర్తించిన సెబీ ఈ మేరకు స్టాక్‌ ఎక్సే్చంజ్‌లకు లేఖ రాసింది. ‘‘ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీల కాంట్రాక్టుల నిబంధనలు (ఎస్‌సీఆర్‌ఆర్‌) 1957కు వ్యతిరేకమంటూ, సభ్యులను ఈ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలంటూ ఆగస్ట్‌ 3న రాసిన లేఖలో సెబీ కోరింది’’అంటూ ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది.

సెక్యూరిటీలు, కమోడిటీ డెరివేటివ్‌లు మినహా ఇతర ఏ కార్యకలాపాలు నిర్వహించడానికి లేదని ఎస్‌సీఆర్‌ఆర్‌ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తన సభ్యులు అందరూ డిజిటల్‌ గోల్డ్‌ తరహా కార్యకలాపాలు నిర్వహించకుండా నియంత్రణపరమైన నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘డిజిటల్‌ గోల్డ్‌ సేవల్లో ఉన్న సభ్యులు ఇందుకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి నెలలోపు అమలు చేయాలి’’ అంటూ ఎన్‌ఎస్‌ఈ ఈ నెల10నే ఆదేశాలు జారీ చేసింది.  

నియంత్రణల పరిధిలో లేదు..
దీనిపై ట్రేడ్‌స్మార్ట్‌ చైర్మన్‌ విజయ్‌ సింఘానియా స్పందిస్తూ.. డిజిటల్‌ గోల్డ్‌ యూనిట్లను నియంత్రణపరమైన సంస్థలు జారీ చేయడం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో డిజిటల్‌ గోల్డ్‌ సర్టిఫికెట్‌లకు సరిపడా భౌతిక బంగారాన్ని నిల్వ చేస్తున్న విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు.

మరిన్ని వార్తలు