రెట్టింపు ఆదాయంపై ఎన్‌టీటీ ఇండియా దృష్టి

10 Mar, 2023 00:52 IST|Sakshi

ముంబై: జపాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఎన్‌టీటీ గ్రూప్‌ భారత్‌లో తమ స్టోరేజీ సామర్థ్యాన్ని, కార్యకలాపాల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది. వచ్చే రెండేళ్లలో ఈ లక్ష్యాలను సాధించాలని భావిస్తున్నట్లు ఎన్‌టీటీ డేటా ఇండియా ఎండీ అభిజిత్‌ దూబే తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో దేశీయంగా 2.5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు. మరిన్ని డేటా సెంటర్లు, హరిత శక్తి, సబ్‌మెరైన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ సదుపాయాలు మొదలైన వాటిపై ఈ నిధులను వెచ్చించనున్నట్లు దూబే తెలిపారు.

2018లో ప్రకటించిన 2 బిలియన్‌ డాలర్లకు అదనంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఆయన వివరించారు. జపాన్‌ వెలుపల తమకు ఇదే అతి పెద్ద మార్కెట్‌ అని దూబే తెలిపారు. వివిధ దేశాల్లో తమకు మొత్తం 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. భారత్‌లో ఏకంగా 37,000 మంది పైగా ఉన్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ గ్రూప్‌ ఆదాయం 20 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా.. భారత విభాగం వాటా 700 మిలియన్‌ డాలర్లుగా ఉందని దూబే చెప్పారు. రాబోయే రెండేళ్లలో దీన్ని రెట్టింపు చేసుకుని సుమారు 2 బిలియన్‌ డాలర్లకు పెంచుకోగలమని ఆయన ధీమా వ్య క్తం చేశారు. నెట్‌మ్యాజిక్‌ సంస్థ కొనుగోలు ద్వారా ఎన్‌టీటీ గ్రూప్‌.. భారత మార్కెట్లో ప్రవేశించింది.

మరిన్ని వార్తలు