ఆర్ధిక మాంద్యం భయాలు.. ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌కు తగ్గిన డిమాండ్‌?

22 Mar, 2023 08:26 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో కార్యాలయ స్థలాల (ఆఫీస్‌ స్పేస్‌) లీజు ఈ ఏడాది 25–30 శాతం క్షీణించొచ్చని (క్రితం ఏడాదితో పోలిస్తే) కొలియర్స్‌ ఇండియా, ఫిక్కీ నివేదిక తెలిపింది. ఆఫీస్‌ స్పేస్‌ లీజు 35–38 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ‘ఆఫీసు స్పేస్‌ విభాగంలో వస్తున్న ధోరణులు, అవకాశాలు – 2023’ పేరుతో కొలియర్స్‌ ఇండియా, ఫిక్కీ ఒక నివేదికను విడుదల చేశాయి. 

2022లో స్థూలంగా కార్యాలయాల స్థలాల లీజు పరిమాణం 50.3 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు ఏడాదిలో నమోదైన 32.9 మిలియన్‌ చదరపు అడుగుల లీజు పరిమాణంతో పోలిస్తే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె నగరాలకు సంబంధించిన వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. 

చదవండి👉 అపార్ట్‌మెంట్‌ ప్రారంభ ధర రూ.30 కోట్లు.. రెంట్‌ నెలకు రూ.10లక్షలు!

ద్వితీయ భాగంలో డిమాండ్‌  
ఆర్థిక సమస్యలు నెమ్మదిస్తాయని, మొత్తం మీద స్థలాల లీజుదారుల విశ్వాసాన్ని ఏమంత ప్రభావితం చేయవని ఈ నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరికి లీజు లావాదేవీలు గణనీయంగా పెరగొచ్చని, తాత్కాలికంగా నిలిపివేసిన లీజులపై కార్పొరేట్లు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేసింది. ఒకవేళ నిరాశావహ వాతావరణం ఉంటే, ఆర్థిక సమస్యలు కొనసాగితే డిమాండ్‌ రకవరీపై ప్రభావం పడుతుందని తెలిపింది. 

ప్రస్తుతానికి ఆఫీస్‌ స్పేస్‌ మార్కెట్‌ అనిశ్చితిగా ఉందని, అంతర్జాతీయ అనిశ్చితులు, ఇతర సమస్యలు నెమ్మదిస్తే అప్పుడు డిమాండ్‌ పుంజుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో బలమైన వ్యాపార మోడళ్లు ఉన్న స్టార్టప్‌లు, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు లీజుకు ముందుకు రావచ్చని పేర్కొంది. కరోనా ముందున్న గరిష్ట స్థాయి లీజు స్పేస్‌ పరిమాణానికి మించి డిమాండ్‌ తగ్గకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది.  

చదవండి👉 విదేశీయులకు షాకిచ్చిన కెనడా..ఆందోళన

మరిన్ని వార్తలు