Ola, Okinawa EV Scooter Fire: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్‌ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..!

28 Mar, 2022 20:34 IST|Sakshi

మహారాష్ట్ర, తమిళనాడులో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఒకినావా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్న రెండు సంఘటనలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించాలని కేంద్రం మార్చి 28న నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ మీడియా పేర్కొంది. గత కొద్ది రోజుల క్రితం పూణే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూట​ర్‌ ఎస్‌ 1ప్రో బైకు అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. 

నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్‌ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. అలాగే, తమిళనాడులోని వెల్లూర్‌లో ఛార్జింగ్‌ పెట్టిన ఎలక్ట్రిక్‌ బైకు మంటల్లో చిక్కుకోవడం కారణంగా ఇద్దరు మరణించారు. దురైవర్మ అనే ఫోటోగ్రాఫర్‌ ఇటీవలే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొన్నాడు. రాత్రి ఛార్జింగ్‌ పెట్టి నిద్రకు ఉపక్రమించాడు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా స్కూటర్‌కు మంటలు అంటున్నాయి. ఇళ్లంతా పొగ వ్యాపించడంతో దుర్మైవర్మ, అతని కూతురు ప్రీతీ మోహాన ఇద్దరు నిద్రలోనే చనిపోయారు.

అయితే, ఇటీవల ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో మంటలు చెలరేగడంతో చాలా మంది వినియోగదారులను ఆందోళనకు గురిఅయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్రం ప్రోత్సాహిస్తున్న ఈ తరుణంలో ఈ మంటలు చెలరేగడంతో ఈ ఘటనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈవీలకు మంటలు అంటుకున్న కేసులను స్వతంత్ర నిపుణుల బృందం దర్యాప్తు చేయనుంది. ఈ మంటలు చెలరేగడానికి నిర్మాణాత్మక లేదా బాహ్య కారకాలు కారణమయ్యాయా అని పరిశోధించడానికి నిపుణుల బృందం వెల్లూరు, పూణేకు వెళ్లనున్నారు. 

ముఖ్యంగా, ఈ రెండు ద్విచక్రవాహనాలు ప్రారంభించడానికి ముందు పరీక్షించి, రోడ్డు మీద తిరగడానికి అనుమతులు జారీ చేశాయి. వాహన తయారీలో లోపం ఉన్నదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్కువ శాతం లిథియం-అయాన్ బ్యాటరీలు(ఓలా స్కూటర్లలో ఉపయోగిస్తారు). ఈ ఎలక్ట్రిక్ వాహనాలలో ఉపయోగించినా బ్యాటరీని సరిగ్గా తయారు చేయకపోయినా లేదా దెబ్బతిన్నా, బ్యాటరీని ఆపరేట్ చేసే సాఫ్ట్వేర్ సరిగ్గా డిజైన్ చేయకపోయినా మంటలు చెలరేగవచ్చు. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్‌ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్‌ రియాక‌్షన్‌ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే  నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్‌ యూజర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ మద్దతు గల ఓలా ఎలక్ట్రిక్ గత వారం ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు తెలిపింది. పూణేకు చెందిన ఒక ట్విట్టర్ యూజర్ తన ఓలా స్కూటర్ మంటల్లో కాలిపోతున్న వీడియోను షేర్ చేయడంతో ఓలా ఈ దర్యాప్తును ప్రారంభించింది. దీనికి ప్రతిస్పందనగా, కంపెనీ ఒక ప్రకటనలో ఇలా తెలిపింది: "మా స్కూటర్లలో పూణేలో జరిగిన ఒక సంఘటన గురించి మాకు తెలుసు. మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నాము. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్నివిషయాలను మీతో పంచుకుంటాము" అని కంపెనీ తెలిపింది.

(చదవండి: OnePlus 10 Pro: లీకైన వ‌న్‌ప్ల‌స్ 10 ప్రో ధ‌ర.. ఎంతో తెలుసా?)

మరిన్ని వార్తలు