రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌!

8 Mar, 2021 15:42 IST|Sakshi

ప్రస్తుతం పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా తమ వాహనాలను బయటకి తీయాలంటేనే సామాన్య ప్రజానీకం భయపడుతున్నారు. అలాగే, పెరుగుతున్న చమురు ధరల కారణంగా నిత్యావసర ధరలు, ప్రయాణ చార్జీలు భారం అవుతున్నాయి. ఇలా ఒక్కటేమిటి ప్రతి ఒక్క వస్తువు ధర ఇంధన ధరల చేత ప్రభావితమవుతుంది. కానీ భవిష్యత్ లో శిలాజ ఇంధనాల శకం ముగియనున్న నేపథ్యంలో రాబోయే కాలమంతా స్వచ్ఛ ఇంధనంతో నడిచే వాహనాలదే కానుంది. పెరుగుతున్న ధరల కారణంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజానీకం దృష్టి వెళ్తుంది. 

ప్రస్తుతం లభిస్తున్న పెట్రోల్ వాహనాల ధరలోనే ఎలక్ట్రిక్ వాహనాలు లభించడంతో ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే ప్రతి ఆటోమొబైల్ కంపెనీ ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అటు వైపు "ఓలా ఎలక్ట్రిక్" సంస్థ అడుగువేస్తుంది. భారత్‌ కేంద్రంగా ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ పై పట్టు సాధించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆ దిశగా ఇప్పటికే బెంగళూరుకు కొద్ది దూరంలోని తమిళనాడు రాష్ట్రపరిధిలోని ప్రాంతంలో ‘ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ’కి పునాది రాయి వేసింది. కంపెనీ కార్యనిర్వణాధ్యక్షుడు(సీఈవో) భవిష్‌ అగర్వాల్‌ వారాంతంలో ఇక్కడే గడుపుతూ పనులు త్వరిగతిన జరిగేలా చూస్తున్నారు. 

కృష్ణగిరిలో భారీ పెట్టుబడి 
బెంగళూరు నుంచి చెన్నై వైపు 150 కి.మీ దూరంలో ఉన్న తమిళనాడులోని కృష్ణగిరి అనే ప్రాంతంలో భారీ స్థాయిలో బుల్డోజర్లు, యంత్రాలు పనిచేస్తున్నాయి. దాదాపు 500 ఎకరాల్లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. మొదటి దశ పనులను వచ్చే జూన్ నాటికీ పూర్తీ చేయాలనీ చూస్తున్నారు. పూర్తి స్థాయి నిర్మాణం 2022, జూన్‌ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. తోలి దశలో 330 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,400 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. వచ్చే పది సంవత్సరాలలో 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.14,64,550 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు వాహన తయారీ కేంద్రానికి చిరునామా‌ కానుంది.

రెండు సెకన్లకు ఒక స్కూటర్
అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే.. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ 2022 వేసవి నాటికి 10 మిలియన్ వాహనాలను లేదా ప్రపంచంలోని 15 శాతం ఎలక్ట్రిక్-స్కూటర్లను తయారు చేయాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ప్లాంట్ విస్తరించిన తర్వాత ప్రతి రెండు సెకన్లకు ఒక స్కూటర్ బయటకు రానుంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం 10 పూర్తిస్థాయి ప్రొడక్షన్‌ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. 3,000 రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఈ ఫ్యాక్టరీలో 10 వేల మంది ఉపాధి కల్పించనున్నారు. 

అలాగే రాబోయే పది ఏళ్లలో వాహనాలతో పాటు బ్యాటరీలు, మోటార్లు, వాహనాల సాఫ్ట్‌వేర్‌ తయారీ కేంద్రాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. వీటన్నింటినీ ఓలా స్వయంగా డిజైన్‌ చేసి తమ వాహనాల్లో వినియోగించాలని చూస్తుంది. ఇందుకోసం భారీ స్థాయిలో పరిశోధన కార్యక్రమాలు సాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 100 పేటెంట్లను కూడా తన స్వంతం చేసుకుంది. వీటిలో కొన్ని భవిష్‌ అగర్వాల్‌ పేరిట ఉన్నాయి. ఇక కంపెనీ ఇంధన అవసరాల్లో 20శాతం సౌరవిద్యుత్తుని వినియోగించుకోనున్నారు. భవిష్యత్తుల్లో ఇక్కడి నుంచే కార్లు కూడా తయారు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా కూడా బెంగళూరు సమీపంలో ప్లాట్ నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. భవిష్యత్ లో ఓలాకు టెస్లా నుంచి భారీపోటీ ఏర్పడనుంది.

చదవండి:

కరోనా కాలంలో చైనాపై కాసుల వర్షం

ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!

మరిన్ని వార్తలు