భారీగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు: మార్చిలో ఏకంగా..

31 Mar, 2023 21:20 IST|Sakshi

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ మంచి అమ్మకాలను పొందుతూ దాని ప్రత్యర్థుల కంటే శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023 మార్చి అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లో మొత్తం 27,000 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. గత ఏడు నెలలుగా దేశీయ విఫణిలో తిరుగులేని అమ్మకాలు పొందుతున్న ఓలా ఇప్పుడు కూడా మంచి అమ్మకాలను పొందుతూ 30 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు మంచి పురోగతిని సాధించాయి. కంపెనీ అమ్మకాలు గత కొన్ని నెలలుగా క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కంపెనీ ఉత్తమ అమ్మకాలు పొందటానికి, అదే సమయంలో కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందించడానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

(ఇదీ చదవండి: హోండా కొత్త బైక్.. ధర చాలా తక్కువ)

ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు దేశం మొత్తం మీద ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను ప్రారంభించడానికి సిద్ధమైంది, ఇందులో భాగంగానే 400 కంటే ఎక్కువ సెంటర్‌లను ప్రారభించింది. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఇవన్నీ కంపెనీ అమ్మకాలు పెరగటానికి చాలా దోహదపడ్డాయి.

ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏథర్ 450ఎక్స్, హీరో విడా వి1 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ మంచి సంఖ్యలో అమ్మకాలు పొందటం గొప్ప విషయం అనే చెప్పాలి. ఇప్పటికే కంపెనీ ఎస్1, ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ వంటి వాటిని విక్రయిస్తూ ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో కంపెనీ ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది.

మరిన్ని వార్తలు