ఒలెక్ట్రాకు 300 బస్‌ల ఆర్డర్‌

23 Jul, 2022 01:24 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ తాజాగా 300 బస్‌లకు ఆర్డర్‌ దక్కించుకుంది. డీల్‌ విలువ రూ.500 కోట్లు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (టీఎస్‌ఆర్‌టీసీ) 20 నెలల్లో బస్‌లు చేరనున్నాయి. ఇప్పటికే మూడేళ్లుగా హైదరాబాద్‌ రోడ్లపై సంస్థ తయారీ ఈ–బస్‌లు విజయవంతంగా పరుగెడుతున్నాయని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్‌ తెలిపారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన ఫేమ్‌–2 పథకంలో భాగంగా 300 ఈ–బస్‌ల సరఫరా ఆర్డర్‌ను టీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఈవీ ట్రాన్స్‌ చేజిక్కించుకుంది. ఈవీ ట్రాన్స్‌ ఈ బస్‌లను   ఒలెక్ట్రా నుంచి కొనుగోలు చేసి టీఎస్‌ఆర్‌టీసీకి అందజేస్తుంది. ఒలెక్ట్రాతోపాటు, ఈవీ ట్రాన్స్‌ను మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) ప్రమోట్‌ చేస్తోంది.  

మరిన్ని వార్తలు