వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం

17 Jun, 2021 17:20 IST|Sakshi

వన్ ప్లస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ చివరకు ఒప్పోతో విలీనం కానున్నట్లు ప్రకటించింది. వన్ ప్లస్ సహ వ్యవస్థాపకుడు & సీఈఓ పీట్ లావ్ మాట్లాడుతూ.. మరింత మందికి చేరుకునే ప్రయత్నాల్లో భాగంగా వన్ ప్లస్ ను ఒప్పోలో విలీనం చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విలీనం తర్వాత కూడా వన్ ప్లస్, ఒప్పో రెండూ ప్రత్యేక బ్రాండ్లుగా స్వతంత్రంగా పనిచేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వన్ ప్లస్ ఈ మధ్యే సరసమైన స్మార్ట్ ఫోన్ నార్డ్ సీఈని భారతదేశం, ఇతర మార్కెట్లలో లాంఛ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఈ ప్రకటన చేసింది.

వన్ ప్లస్ కస్టమర్ ల కొరకు "ఇంకా మెరుగైన ఉత్పత్తులను" అందించడానికి ఒప్పోతో విలీనం అయినట్లు సీఈఓ ఫోరం పోస్ట్ లో పేర్కొన్నారు. వన్ ప్లస్, ఒప్పో రెండూ చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ యాజమాన్యం కింద ఉన్నాయి. వాటితో పాటు వివో, రియల్ మీ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ, వాటి ప్రారంభం నుంచి అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయి. వన్ ప్లస్ ను లావ్, అతని కార్ల్ పెయ్ కూడా సహ-స్థాపించారు. డిసెంబర్ 2013లో కంపెనీ స్థాపించడానికి ముందు ఇద్దరూ ముందు ఒప్పోలో పనిచేశారు. తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల మరిన్ని మంచి ఉత్పత్తులను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు రెండు సంస్థలు తెలిపాయి.

చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ తీపికబురు 

మరిన్ని వార్తలు