ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీ!

23 Nov, 2022 11:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్‌టీకే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సుముఖత చూపిస్తున్నారు. అది గేమ్‌ లేక నైపుణ్యం లేక మరొకటి అయినా 28 శాతం జీఎస్‌టీ రేటు ఉండాలని కోరుతున్నారు. 28 శాతం జీఎస్‌టీ ప్రతికూలమని, తక్కువ పన్ను రేటునే కొనసాగించాలని పరిశ్రమ కోరుతుండడం గమనార్హం. ఆన్‌లైన్‌ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన నేపథ్యంలో.. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా మంగళవారం వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పన్ను రేటును 28 శాతానికి పెంచాలని డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రుల గ్రూప్‌ ఈ సూచనలను జీఎస్‌టీ మండలికి నివేదించనుంది. తదుపరి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఈ సూచనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18 శాతం జీఎస్‌టీ రేటు అమల్లో ఉంది. స్థూల గేమింగ్‌ ఆదాయంపై ఈ పన్ను అమలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు