ChatGPT: యూజర్లకు భారీ షాక్‌.. చాట్‌ జీపీటీకి కొత్త చిక్కులు!

14 Jan, 2023 21:17 IST|Sakshi

చాట్‌ జీపీటీ! పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు గుబులు పుట్టించేలా వినియోగించడానికి అందుబాటులోకి రాకుండానే కేవలం రెండు వారాల్లో 10లక్షల మంది యూజర్లను సొంతం చేసుకుంది. యూజర్లు వినియోగిస్తే రెండేళ్లలో గూగుల్‌ను దాటేస్తుందని టెక్‌ నిపుణుల అంచనా. 

ఈ తరుణంలో చాట్‌ జీపీటీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డట్లు తెలుస్తోంది. నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, భారీగా పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాల్ని అర్జించేందుకు ట్విటర్‌ తరహాలో పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 

చాట్‌ జీపీటీ సంస్థ కాదు సాఫ్ట్‌వేర్‌ 
శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఓపెన్‌ఏఐ అనే సంస్థ కృత్రిమ మేధ సాయంతో తయారు చేసిన సాఫ్ట్‌వేరే ఈ చాట్‌జీపీటీ. ఈ సంస్థ కోఫౌండర్‌, సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ మాట్లాడుతూ.. చాట్‌జీపీటీ నిర్వహణ ఖర్చులు కంటి నీరు (eye-watering) తెప్పిస్తున్నాయి. 

యూజర్లు చేసే ఒక్కో చాట్‌కు కొన్ని సెంట్స్‌ ఖర్చు చేయాల్సి వస్తుంది.  దీన్ని భద్రంగా ఉంచేందుకు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేస్తున్నాం. ఇది సరిపోదన్నట్లుగా మైక్రోసాఫ్ట్‌ మరో 10 బిలియన్ల పెట్టుబడులు పెట్టబోతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెరసీ ఒత్తిడి నుంచి బయట పడేందుకు ట్విటర్‌ తరహాలో యూజర్లకు పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆల్ట్‌ మాన్‌ తెలిపారు. 

చాట్‌జీపీటీ ప్రొఫెషనల్‌ పేరుతో 
చాట్‌జీపీటీ ప్రొఫెషనల్‌ పేరుతో పెయిడ్‌ వెర్షన్ సర్వీసుల్ని యూజర్లకు అందించనుంది. 'ప్రో' వెర్షన్‌తో చాట్‌జీపీటీ సేవల్ని యూజర్లకు అందిస్తే తద్వారా మాతృసంస్థ ఓపెన్‌ఏఐకి ఆదాయాన్ని అర్జించవచ్చని భావిస్తుంది. ప్రస్తుతం పెయిడ్‌ వెర్షన్‌ ప్రారంభ దశలో ఉండగా..పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చిన వెంటనే పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని అందించనుంది.

మరిన్ని వార్తలు