Oppo Oneplus Smartphone: ఒప్పో, వన్‌ప్లస్‌ ఫోన్లు బ్యాన్‌ చేయాలని కోర్టు తీర్పు!

12 Jul, 2022 17:23 IST|Sakshi

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌కి జర్మనీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పేటెంటెడ్ టెక్నాలజీకి సంబంధించి నోకియా ఈ రెండు కంపెనీలపై జర్మనీలోని మాన్‌హీమ్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. విచారణ జరిపిన అనంతరం కోర్టు నోకియా సంస్థకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్‌ ఫోన్‌లను  బ్యాన్ చేయాలని తీర్పునిచ్చింది.

ఏంటి ఆ వివాదం..
వివరాల్లోకి వెళితే.. నోకియా సంస్థ 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై పేటెంట్‌ కలిగి ఉంది. అందులోని ఓ టెక్నాలజీని నోకియా అనుమతులు లేకుండానే ఒప్పో, వన్‌ప్లస్‌లు ఉపయోగించాయి. ఓ వార్తా సంస్థ ప్రకారం.. 4G (LTE), 5G టెక్నాలజీలోని పేటెంట్‌లపై నోకియా, ఒప్పో, వన్‌ప్లస్‌ల మధ్య జరిగిన చర్చల విఫలం కావడంతో వారిపై న్యాయపరమైన చర్యలకు నోకియా సిద్ధమైంది. అనంతరం పలు దేశాలలో ఆ కంపెనీలపై కోర్టులో దావా కూడా వేసింది.

అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం జర్మనీ కోర్టు ఇచ్చిన తీర్పు మొదటిది. నోకియా మూడు ప్రాంతీయ జర్మన్ కోర్టులలో తొమ్మిది స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు (SEP), ఐదు ఇంప్లిమెంటేషన్ పేటెంట్ల విషయంలో ఒప్పోపై దావా వేసింది. సుమారు $130.3 బిలియన్ల భారీ పెట్టుబడులతో 5G స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్లు(SEP) విభాగంలో నోకియా నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు, ఈ రంగంలో అనేక పేటెంట్‌లను నోకియా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాదానికి కారణం నోకియా యూరోపియన్ పేటెంట్ EP 17 04 731 ఉల్లంఘించినందుకు ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలపై దావా వేసింది. అయితే ఈ తీర్పుపై ఒప్పో, వన్‌ప్లస్‌లు ఎలా ముందుకు వెళ్లనున్నాయో చూడాలి.

చదవండి: మీకు నచ్చితే నాదే: ఆనంద్‌ మహీంద్రకు నెటిజన్లు ఫిదా!

మరిన్ని వార్తలు