ఓరియంట్‌ బెల్‌- ఫీనిక్స్‌ మిల్స్‌.. జూమ్‌

24 Aug, 2020 14:50 IST|Sakshi

పొరింజు వెలియత్‌ వాటా కొనుగోలు

13 శాతం దూసుకెళ్లిన ఓరియంట్‌ బెల్‌

సింగపూర్‌ ప్రభుత్వం, ఫండ్స్‌ పెట్టుబడులు

6 శాతం జంప్‌చేసిన ఫీనిక్స్‌ మిల్స్‌

ప్రసిద్ధ ఇన్వెస్టర్‌ పొరింజు వెలియత్‌.. ఈక్విటీ వాటా కొనుగోలు చేసిన వార్తలతో సిరామిక్‌ టైల్స్‌ తయారీ కంపెనీ ఓరియంట్‌ బెల్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోవైపు సింగపూర్‌ ప్రభుత్వం మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడికావడంతో రియల్టీ సంస్థ ఫీనిక్స్‌ మిల్స్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..  

ఓరియంట్‌ బెల్‌ లిమిటెడ్‌
కంపెనీలో పొరింజు వెలియత్‌కు చెందిన ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ తాజాగా వాటా కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో ఓరియంట్‌ బెల్‌ కౌంటర్‌ జోరందుకుంది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 105ను తాకింది. తదుపరి కొంత మందగించింది. ప్రస్తుతం 7 శాతం లాభంతో రూ. 99 వద్ద ట్రేడవుతోంది. షేరుకి రూ. 91.87 ధరలో ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ 80,000 ఓరియంట్‌ బెల్‌ షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పటికే అంటే.. జూన్‌కల్లా ఓరియంట్‌ బెల్‌లో 1.57 శాతం వాటాను ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ కలిగి ఉంది. 

ఫీనిక్స్‌ మిల్స్‌ లిమిటెడ్
క్విప్‌ ద్వారా రియల్టీ అభివృద్ధి సంస్థ ఫీనిక్స్‌ మిల్స్‌లో సింగపూర్‌ ప్రభుత్వం 74.38 లక్షల షేర్లను సొంతం చేసుకుంది. దీంతో ఫీనిక్స్‌ మిల్స్‌లో సింగపూర్‌ ప్రభుత్వ వాటా 4.3 శాతానికి చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ ఎంఎఫ్‌కు 12.39 లక్షల షేర్లు, ఎస్‌బీఐ ఎంఎఫ్‌కు 12.39 లక్షల షేర్లు, ఏబీ సన్‌ లైఫ్‌ ఎంఎఫ్‌కు 5.17 లక్షల షేర్లు చొప్పున ఫీనిక్స్‌ విక్రయించింది. దీంతో మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా తాజాగా 12.61 శాతాన్ని తాకింది. క్విప్‌లో భాగంగా షేరుకి రూ. 605 ధరలో ఫీనిక్స్‌ 1.81 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేసింది. తద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించింది. క్విప్‌ తదుపరి ఫీనిక్స్‌ ఈక్విటీ క్యాపిటల్‌ రూ. 34.32 కోట్లకు ఎగసింది. ఈ నేపథ్యంలో ఫీనిక్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 6.3 శాతం జంప్‌చేసి రూ. 738ను తాకింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 713 వద్ద ట్రేడవుతోంది.

>
మరిన్ని వార్తలు