దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు

8 Nov, 2021 17:30 IST|Sakshi

దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు ఇంకా ప్రారంభమే కాలేదు. అయినప్పటికీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ల షిప్ మెంట్లు 2021 మూడవ త్రైమాసికంలో ఊపందుకున్నాయి. సీఎమ్ఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్ ప్రకారం మొత్తం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు 22 శాతం ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం తక్కువ ధరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ లభించడమే అని సీఎమ్ఆర్ తెలిపింది. వన్ ప్లస్, ఒప్పో, రియల్ మీ, శామ్ సంగ్, వివో వంటి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ల 5జీ ఎక్కువగా అమ్ముడయ్యాయి అని పేర్కొంది.

"ఈ ఐదు బ్రాండ్లు కలిసి క్యూ3 2021 సమయంలో 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 22,227 కోట్ల)కు పైగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను రవాణా చేశాయి" అని సీఎమ్ఆర్ లోని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ విశ్లేషకుడు షిప్రా సిన్హా చెప్పారు. 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కాకుండా ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు కూడా భారీగా డిమాండ్ ఉంది. అందుకే, భారతదేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్‌ షిప్మెంట్ పరంగా 47 శాతం త్రైమాసీకంలో(క్యూవోక్యూ) వృద్ధి చెందింది. ఉదాహరణకు.. షియోమీ 23 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానాన్ని నిలుపుకుంది. శామ్ సంగ్ 18 శాతం మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో ఉంటే, ఆ తర్వాత వివో, రియల్ మీ ఒక్కొక్కటి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మొదటి ఐదు స్థానాల్లో లేనప్పటికీ, యాపిల్ షిప్ మెంట్ పరంగా 32 శాతం వృద్ధి నమోదు చేసింది. సూపర్ ప్రీమియం(రూ.50,000- 1,00,000) విభాగంలో యాపిల్ 84 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. యాపిల్ ఐఫోన్ 12, ఐఫోన్ 11తో సహా ఇతర ఐఫోన్లు భారీగా అమ్ముడయ్యాయి. 

(చదవండి: మొబైల్ మార్కెట్లోకి శక్తివంతమైన స్వదేశీ 5జీ స్మార్ట్‌ఫోన్‌!)

మరిన్ని వార్తలు