OYO Founder Father Death: నిన్నగాక మొన్న పెళ్లి: ఓయో ఫౌండర్‌ ఇంట తీవ్ర విషాదం

10 Mar, 2023 18:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిన్నగాక మొన్న రితేష్‌ అగర్వాల్‌ వివాహం వైభవంగా జరిగింది. కుటుంబమంతా ఈ సంతోషంలో ఉండగానే రితేష్‌ తండ్రి రమేష్ అగర్వాల్ దుర్మరణం విషాదాన్ని నింపింది. ఈ విషాద వార్తను రితేష్   స్వయంగా  వెల్లడించారు.

“మా కుటుంబం, నేను బరువైన హృదయంతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. మా తండ్రి రమేష్ అగర్వాల్ (మార్చి 10 శుక్రవారం) మరణించారు. నిండైన జీవితాన్ని గడిపిన ఆయన నాతోపాటు మనలో చాలామందికి స్ఫూర్తి. ఆయన మరణం మా కుటుంబానికి తీరని లోటు. ఆయన స్ఫూర్తి ఎల్లపుడూ మా వెన్నంటే ఉంటుంది. ఈ దుఃఖ సమయంలో ప్రతి ఒక్కరూ మా గోప్యతను గౌరవించాలని కోరుతున్నాం’’  అంటూ రితేష్ అగర్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనంపై నుండి రమేష్  పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 54లో DLF ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్తు నుండి పడిపోయారని సెక్యూరిటీ పోలీసులకు సమాచారం అంచారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పోస్ట్‌మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు.  అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా రితేష్ అగర్వాల్ ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్షా సూద్‌ను న్యూఢిల్లీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.   పెళ్లి తర్వాత ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో  ఇచ్చిన రిసెప్షన్‌కు  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ సీఈఓ మసయోషి సన్‌తో సహా పరిశ్రమ   ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు