ఓయోకు నిర్వహణ లాభాలు

20 Sep, 2022 09:49 IST|Sakshi

క్యూ1లో రూ. 7.27 కోట్లు 

ఆదాయం రూ. 1,459 కోట్లు 

న్యూఢిల్లీ: ఆతిథ్యం, ప్రయాణ సేవల(ట్రావెల్‌ టెక్‌) కంపెనీ ఓయో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో మొత్తం ఆదాయం రూ. 1,459 కోట్లను అధిగమించింది. రూ. 7.27 కోట్ల సర్దుబాటు తదుపరి నిర్వహణా(ఇబిటా) లాభం ఆర్జించింది. మార్చితో ముగిసిన గతేడాది (2021–22) ఆదాయం రూ. 4,781 కోట్లను తాకగా.. అంతక్రితం ఏడాది(2020–21) దాదాపు రూ. 3,962 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

గతేడాది దాదాపు రూ. 472 కోట్ల నిర్వహణా(ఇబిటా) నష్టం ప్రకటించింది. ఇక తాజా క్యూ1లో రూ. 414 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది రూ. 1,940 కోట్లమేర నికర నష్టం నమోదైంది. కాగా.. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా కంపెనీ గతేడాది అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆర్థిక ఫలితాలను సెబీకి దాఖలు చేసింది.

చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే!


     


 

మరిన్ని వార్తలు