మరోసారి పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు

25 Jun, 2021 19:57 IST|Sakshi

పాన్‌-ఆధార్‌ లింకింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడగించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో గడువును మూడు నెలలు సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో విధించిన గడువు జూన్‌ 30తో దగ్గర పడుతున్న వేళ కేంద్రం ఈ కీలక ప్రకటన చేసింది. మొదట పాన్-ఆధార్ లింకు గడువును మార్చి 31 పేర్కొన్నారు. తర్వాత కూడా కరోనా మహమ్మరి వల్లనే జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా మరోసారి మూడు నెలల పాటు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది ప్రవేశ పెట్టిన ఆర్ధిక బిల్లులో ప్రభుత్వం ఒక సవరణను కూడా చేసింది. కొత్త నిబందనల ప్రకారం ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్యం రుసుము కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాన్‌-ఆధార్‌ లింకింగ్  పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్‌ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

అలాగే, కొవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది. వివాద్‌ సే విశ్వాస్‌ పథకం గడువును మరో రెండు నెలలు (ఆగస్టు 31 వరకు) పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫారం-16 గడువును జులై 15 నుంచి జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే నిబందనల ప్రకారం ‎మొదటిసారి ఇల్లును కొనుగోలు చేస్తే దానిపై పెట్టె‎‎ పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఈ గడువును జూన్ 30 నుంచి మరో 3 నెలలు పొడగించింది.

చదవండి: పీఎఫ్ ఖాతాలో బ్యాంక్ ఖాతా వివరాలు అప్ డేట్ చేయండి ఇలా?

>
మరిన్ని వార్తలు