-

పనామా రేంజ్‌లో పండోరా.. సచిన్‌సహా పలువురి పేర్లు మాత్రమే? ఇరకాటంలో ఇమ్రాన్‌ ఖాన్‌

4 Oct, 2021 07:50 IST|Sakshi

Pandora Papers 2021 Sachin Name: లక్షల మంది ప్రముఖుల గోప్యపు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ‘పండోరా పేపర్స్‌-2021’ స్కాండల్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశ అధ్యక్షుల మొదలు..  సినీ తారల దాకా లక్షల మంది విదేశీ రహస్య ఆస్తులు, లావాదేవీలకు సంబంధించిన రహస్య డాక్యుమెంట్లను ఇంటర్నేషనల్‌ కన్సోర్షియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బయటపెట్టిన విషయం తెలిసిందే.  అయితే ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులకు డాక్యుమెంట్లలో క్లీన్‌చిట్‌ దక్కగా.. ఆ పేర్లలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ సైతం ఉన్నారు. 


Pandora Papers 2021 వ్యవహారంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు పరోక్షంగా క్లీన్‌చిట్‌ ఇచ్చింది ఐసీఐజే నివేదిక. సచిన్‌ విదేశీ పెట్టుబడులు సక్రమేనని, ఈ విషయాన్ని ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారులు సైతం ధృవీకరించినట్లు ఆయన తరపు అటార్నీ స్టేట్‌మెంట్‌ను పండోరా పేపర్స్‌ నివేదిక స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు కేవలం సచిన్‌ పేరును మాత్రమే పత్రాల్లో పేర్కొన్నామని, ఆయన రహస్య లావాదేవీలకు సంబంధించి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని తెలిపింది . ఇక పాప్‌ సింగర్‌ షకీరా, సూపర్‌ మోడల్‌ మిస్‌ షిఫ్ఫర్‌లకు సైతం క్లీన్‌ చిట్‌ లభించింది.


ఏమిటీ పనామా పేపర్స్‌.. నల్ల ధనవంతుల గుట్టురట్టు!


ఇమ్రాన్‌ సర్కార్‌పై విమర్శలు
మరోవైపు అధికారికంగా వెల్లడించని ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన పండోరా పేపర్స్‌ ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. నేతలు, మాజీ నేతలు, అధికారులు, ఇతరత్ర సెలబ్రిటీల పేర్లు మొత్తంగా 91 దేశాల నుంచి(భారత్‌ నుంచి 300 మంది పేర్లు) అందులో పేర్కొని ఉన్నాయి. మొత్తం పద్నాలుగు రంగాల్లో, దాదాపు 956 కంపెనీల్లో వీళ్లంతా రహస్య పెట్టుబడులు పెట్టడం లేదంటే ఆస్తుల్ని కలిగి ఉన్నట్లు సమాచారం.  భారత్‌ నుంచి ఆరుగురు, పాక్‌ నుంచి ఏడుగురు రాజకీయ నాయకుల పేర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఈ నివేదిక పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను ఇరకాటంలో పడేసింది.

ఆయన సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు, ఆయన కేబినెట్‌ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయని పండోరా పేపర్స్‌ వెల్లడించింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు, పీఎంల్‌–క్యూ పార్టీ నేత చౌదరి మూనిస్‌ ఎలాహీకి అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉందని పత్రాల్లో బహిర్గతమైంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తుండగా.. ఈ కుంభకోణానికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాకే దర్యాప్తునకు ముందుకెళ్తామని పాక్‌ ప్రభుత్వం చెబుతోంది. 


  

ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా ఔట్‌లెట్స్‌, 600 మంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు చేపించుకుని ఈ వివరాలను సేకరించి బట్టబయలు చేసినట్లు ప్రకటించుకుంది ఇంటర్నేషనల్‌ కన్సోర్షియమ్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌.  ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించిన 12 మిలియన్ల (1.20 కోట్లు) పత్రాలను తాము సేకరించినట్లు ఐసీఐజే వెల్లడించింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్‌ ఐలాండ్స్‌ తదితర దేశాల్లో వారు నల్ల ధనాన్ని దాచుకోవడానికి, రహస్యంగా ఆస్తులు పోగేసుకోవడానికి డొల్ల కంపెనీలను సృష్టించారని తెలిపింది. ఇదిలా ఉంటే పండోరా పేపర్స్‌ వివరాలు కేవలం ఆరోపణలు మాత్రమే. వీటిపై దర్యాప్తు చేయించడం, చేయించకపోవడం సంబంధిత ప్రభుత్వాల ఇష్టం. 

మరిన్ని వార్తలు