జులైలో 30 శాతం పెరిగిన వాహన విక్రయాలు

11 Aug, 2020 16:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో అమ్మకాలు లేక డీలా పడిన భారత ఆటో పరిశ్రమ తిరిగి గాడినపడుతోంది. గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు పడిపోతున్న క్రమంలో జులైలో 14,64,133 ప్రయాణీకుల వాహన విక్రయాలు జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో వాహన విక్రయాలు 30 శాతం అధికమని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐఏఎం) గణాంకాలు వెల్లడించింది. జూన్‌లో 11,19,048 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్‌ఐఏఎం తెలిపింది. అయితే గత ఏడాది జులైతో పోలిస్తే తాజా అమ్మకాలు భారీగా పడిపోయాయి. చదవండి : కరోనా భయం.. కారే నయం!

గత ఏడాది జులైలో దేశంలో 17,01,832 వాహన అమ్మకాలు నమోదయ్యాయి. కోవిడ్‌-19 నేపథ్యంలో గత కొద్దినెలలుగా వాహన విక్రయాలు భారీగా పడిపోగా జులైలో ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్రవాహన విక్రయాలు పుంజుకోవడం పరిశ్రమ రికవరీకి సంకేతమని ఎస్‌ఐఏఎం అధ్యక్షుడు రాజన్‌ వధేరా పేర్కొన్నారు. కాగా బీఎండబ్ల్యూ మెర్సిడెస్‌, టాటా మోటార్స్‌, వోల్వో ఆటో వంటి బ్రాండ్స్‌ అమ్మకాల వివరాలు అందుబాటులో లేనందున వాటి వివరాలు ఈ గణాంకాల్లో కలుపలేదని ఎస్‌ఐఏఏం తెలిపింది. ఇక ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే జులైలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 26 శాతం పెరగడం ప్రోత్సాహకరమని ఎస్‌ఐఏఎం పేర్కొంది. ఇక కార్ల విక్రయాలు అంతకుముందు నెలతో పోలిస్తే జులైలో 73 శాతం ఎగబాకాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు