వివాదంపై విమానయాన శాఖ మంత్రి ఆగ్రహం.. నిందితులపై చర్యలకు ఆదేశం

30 Dec, 2022 09:34 IST|Sakshi

బ్యాంకాక్‌ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో ఘటన ముయే థాయ్ (థాయ్‌ బాక్సింగ్‌) గేమ్‌ను తలపించింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన సీటు గొడవ తారా స్థాయికి చేరింది. ఓ ప్రయాణికుడిపై మరో ఐదుగురు ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. గొడవను సద్దుమణిగించేందుకు ఎయిర్‌ హోస్టెస్‌ చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. 

క్యాబిన్‌ క్రూ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పిడిగుద్దులు గుద్దుకున్న వీడియోలు  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఆ వివాదంపై కేంద్ర  విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. వివాదానికి కారణమైన ప్రయాణికులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 

థాయ్‌ స్మైలీ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం డిసెంబర్‌ 26న థాయ్‌ల్యాండ్‌ నుంచి కోల్‌కతాకు వస్తుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి  క్రూ సిబ్బంది ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ఓ ఎయిర్‌ హోస్ట్‌ బ్రౌన్‌ కలర్‌ (గోధుమ రంగు) షర్ట్‌ ధరించిన ప్రయాణికుడు తాను కూర్చున్న సీటును నిటారుగా జరపాలని కోరింది. 

అంతే బ్రౌన్‌ కలర్‌ షర్ట్‌ ధరించిన వ్యక్తి రెచ్చిపోయి తన పక్కనే గ్రే కలర్‌ (బూడిద రంగు) చొక్కా ధరించిన వ్యక్తిపై దాడికి దిగాడు. వివాదానికి కారణమైన ప్రయాణికుడు తన కళ్లజోడు తీసి నల్ల చొక్కా ధరించిన బాధితుడి చెంపలు వాయిస్తూ, ఆపకుండా పిడిగుద్దులు గుద్దాడు. దాడికి పాల్పడే వ్యక‍్తికి మద్దతుగా అతని స్నేహితులు సైతం కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలో ఈ గొడవను ఆపేందుకు ఎయిర్‌ హోస్టెస్‌ ప్లీజ్‌ సార్‌.. ప్లీజ్‌ సార్‌ అని ఒకటే ప్రాధేయ పడుతున్నా పట్టించుకో లేదు. 

నిందితుడు కోల్‌ కతాలో  ఫ్లైట్‌ దిగే సమయంలో సైతం తన సీటు బెల‍్ట్‌ తీసి తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అదే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్న అలోక్‌ కుమార్‌ అనే ప్రయాణికుడు తెలిపారు.కాగా, విమానంలో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఏవియేషన్‌ మినిస్టర్‌ జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా గొడవలు విమాన ప్రయాణంలో ఆమోదయోగ్యం కాదని ట్వీట్‌ చేశారు. ఈ ఘటనలో కారణమైన ప్రయాణికులకు కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులుకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.


చదవండి👉  రతన్‌ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు!

మరిన్ని వార్తలు