పేటీఎం ఎఫెక్ట్‌.. ఐపీవోకి భయపడుతున్న కంపెనీలు

24 Nov, 2021 08:31 IST|Sakshi

ఐపీవోకు మొబిక్విక్‌ వెనకడుగు

పేటీఎమ్‌ డిస్కౌంట్‌ లిస్టింగ్‌ ఎఫెక్ట్‌  

Indian Paytm Effect MobiKwik to Delay Planned IPO: ఫిన్‌టెక్‌ కంపెనీ మొబిక్విక్‌ సరైన సమయంలో పబ్లిక్‌ ఇష్యూను చేపట్టనున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో కంపెనీ ఐపీవో ప్రణాళికల అమలును ఆలస్యం చేసే వీలున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి సరైన విలువను ఆకట్టుకోవడంలో కంపెనీకి ఎదురవుతున్న సవాళ్లు ఇందుకు ప్రభావం చూపుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. అంతేకాకుండా ఇటీవల డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్‌ ఐపీవోకు సరైన స్పందన లభించకపోవడం, లిస్టింగ్‌లో నిరాశపరచడం వంటి అంశాలు సైతం కారణమైనట్లు తెలియజేశాయి. 

పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 1,900 కోట్ల సమీకరణకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి మొబిక్విక్‌ ఇప్పటికే అనుమతులు పొందిన విషయం విదితమే. కాగా.. తొలి నాలుగేళ్లు తక్కువ పెట్టుబడితోనే వృద్ధిబాటలో సాగిన కంపెనీ ప్రస్తుతం 10.1 కోట్ల యూజర్లను సాధించినట్లు మొబిక్విక్‌ పేర్కొంది. ఇందుకు కేవలం 10 కోట్ల డాలర్లు(సుమారు రూ. 750 కోట్లు) వెచ్చించినట్లు తెలియజేసింది. ఎల్లప్పుడూ నిలకడైన వ్యూహాలనే అమలు చేస్తూ రావడంతో పటిష్ట వృద్ధిని సాధిస్తున్నట్లు వివరించింది. తద్వారా లాభదాయకతవైపు ప్రయాణిస్తున్నామని, వెరసి సరైన సమయంలో కంపెనీ లిస్టింగ్‌ను చేపడతామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనుగోలు చేసి తదుపరి చెల్లించే(బీఎన్‌పీఎల్‌) పథకంపై దృష్టి సారించిన కంపెనీ 2021 మార్చికల్లా అత్యధిక స్థాయిలో 22.3 మిలియన్ల ప్రీఅప్రూవ్‌డ్‌ బీఎన్‌పీఎల్‌ వినియోగదారులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 
 

చదవండి: పేటీఎం ఢమాల్‌..! రూ.38 వేల కోట్ల లాస్‌ అతడి వాళ్లే..! నెటిజన్ల ఫైర్‌..!

మరిన్ని వార్తలు