Paytm: సాధారణ బీమా కోసం పేటీఎం జాయింట్‌ వెంచర్‌

23 May, 2022 01:22 IST|Sakshi

పదేళ్లలో రూ.950 కోట్ల పెట్టుబడులు

న్యూఢిల్లీ: సాధారణ బీమా కోసం ‘పేటీఎం జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌’ (పీజీఐఎల్‌) పేరుతో జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటుకు వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం మాతృ సంస్థ) నిర్ణయం తీసుకుంది. ఆరంభంలో వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు పీజీఐఎల్‌లో 49 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 51 శాతం వాటా సంస్థ ఎండీ శేఖర్‌ శర్మకు చెందిన వీఎస్‌ఎస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కలిగి ఉంటుందని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ తెలియజేసింది.

పీజీఐఎల్‌లో పదేళ్లలో రూ.950 కోట్లను వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తుంది. ఈ పెట్టుబడుల తర్వాత జాయింట్‌ వెంచర్‌ కంపెనీలో వన్‌ 97 వాటా 74 శాతానికి పెరుగుతుంది. శేఖర్‌ శర్మ సొంత సంస్థ వాటా 26 శాతానికి తగ్గుతుంది. ఐఆర్‌డీఏఐ నుంచి వచ్చే సర్టిఫికేట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌కు లోబడి పీజీఐఎల్‌ కార్యకలాపాల ప్రారంభం ఆధారపడి ఉంటుందని వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ తెలిపింది.  

మరిన్ని వార్తలు