పేటీఎంపై రూ.30కే రూ.10వేల కవరేజీ

20 Dec, 2022 05:35 IST|Sakshi

యూపీఐ చెల్లింపులకు రక్షణ ప్లాన్‌ 

ముంబై: పేటీఎం పేరిట చెల్లింపులు, బ్రోకింగ్, మ్యూచువల్‌ ఫండ్స్‌ సహా సమగ్ర ఆర్థిక సేవల్లోని వన్‌97 కమ్యూనికేషన్స్‌.. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో ‘పేటీఎం పేమెంట్‌ ప్రొటెక్ట్‌’ ఉత్పత్తిని విడుదల చేసింది. ఇది గ్రూపు ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. యూపీఐ ద్వారా యాప్‌లు, వ్యాలెట్ల నుంచి నిర్వహించే అన్ని రకాల లావాదేవీలకు ఇది రక్షణ కల్పిస్తుందని పేటీఎం తెలిపింది. ఏడాదికి కేవలం రూ.30 చెల్లించడం ద్వారా.. రూ.10,000 వరకు కవరేజీ పొందొచ్చని పేర్కొంది.

యూపీఐ లావాదేవీల్లో మోసాల వల్ల నష్టపోయిన వారికి ఈ ప్లాన్‌ కింద గరిష్టంగా రూ.10వేల పరిహారం లభించనుంది. త్వరలోనే ఇదే ప్లాన్‌ కింద రూ.లక్ష వరకు రక్షణ కవరేజీని ఆఫర్‌ చేయనున్నట్టు పేటీఎం తెలిపింది. పరిశ్రమలో ఈ తరహా ఉత్పత్తి ఇదే మొదటిది అని, డిజిటల్‌ చెల్లింపుల పట్ల నమ్మకాన్ని పెంచడంతోపాటు, డిజిటల్‌ చెల్లింపులను మరింత మందికి చేరువ చేయడం ఈ ఉత్పత్తి లక్ష్యమని పేర్కొంది.

మరిన్ని వార్తలు