జోరుగా పేటీఎం లావాదేవీలు.. 8.9 కోట్లకు చేరిన యూజర్ల సంఖ్య!

22 Mar, 2023 08:51 IST|Sakshi

న్యూఢిల్లీ: చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం తన వృద్ధిని జనవరి, ఫిబ్రవరి నెలల్లోనూ కొనసాగించింది. ఈ రెండు నెలల్లో నెలవారీ లావాదేవీలు నిర్వహించిన సగటు యూజర్ల సంఖ్య 8.9 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోలిస్తే 28 శాతం వృద్ధి నమోదైంది. 

దేశవ్యాప్తంగా మర్చంట్ల వద్ద పేటీఎం సౌండ్‌బాక్స్‌ డివైజ్‌ల సంఖ్య 64 లక్షలకు చేరుకుంది. వీరు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించే చందాదారులు. ఫిబ్రవరి నెలలో ఏర్పాటు చేసిన డివైజ్‌ల సంఖ్య 3 లక్షలుగా నమోదైంది. వర్తకుల వద్ద చెల్లింపుల లావాదేవీలు కూడా పెరిగాయి. స్థూల మర్చండైజ్‌ వ్యాల్యూ (జీఎంవీ) జనవరి, ఫిబ్రవరి నెలల్లో కలిపి రూ.2.34 లక్షల కోట్లుగా ఉంది. వార్షికంగా చూస్తే 41 శాతం వృద్ధి కనిపించింది. రుణ వితరణ వ్యాపారం కూడా తన జోరును కొనసాగించింది.

తన ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం చేసుకున్న రుణదాతల ద్వారా రెండు నెలల్లో రూ.8,086 కోట్లను మంజూరు చేసింది. వార్షికంగా ఇది 286 శాతం వృద్ధి కావడం గమనించొచ్చు. రెండు నెలల్లో జారీ చేసిన రుణాల సంఖ్య 79 లక్షలుగా ఉంది. 

చదవండి👉 పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!

మరిన్ని వార్తలు