రూ. 6 లక్షల కోట్లు దాటిన పింఛను నిధులు

27 May, 2021 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ: పింఛను పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.6లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ప్రకటించింది. నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌), ఇతర పింఛను పధకాల నిర్వహణతోపాటు, ఈ రంగ అభివృద్ధికి తోడ్పడేందుకు పార్లమెంట్‌ చట్టం ద్వారా ఏర్పాటైందే పీఎఫ్‌ఆర్‌డీఏ. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌తోపాటు అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకాలను ఈ సంస్థ చూస్తోంది. ఈ రెండు పథకాల పరిధిలోని మొత్తం సభ్యుల సంఖ్య 4.28 కోట్లకు చేరుకోగా.. నిర్వహణ నిధులు రూ.6లక్షల కోట్లను దాటాయి.

పీఎఫ్‌ఆర్‌డీఏ ఏర్పాటై 13 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ స్థాయి పురోగతి నమోదైంది. 2020 అక్టోబర్‌ నాటికి రూ.5లక్షల కోట్ల నిర్వహణ ఆస్తుల మైలురాయిని పూర్తి చేసుకోగా.. తర్వాత ఏడు నెలల్లోనే మరో రూ.లక్ష కోట్లు ఈ రెండు పథకాల పరిధిలో వృద్ధి చెందడం గమనార్హం. ఎన్‌పీఎస్‌ కింద 74.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర విభాగం నుంచి 28.37 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పింఛను పథకాల పట్ల సభ్యుల్లో ఉన్న విశ్వాసమే ఈ వృద్ధికి కారణమని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ సుప్రతిమ్‌ బందోపాధ్యాయ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రిటైర్మెంట్‌ ప్రణాళిక, ఆర్థిక శ్రేయస్సు పట్ల వ్యక్తుల్లో అవగాహన పెరిగినట్టు చెప్పారు.

చదవండి: ఆరేళ్లలో రూ.15లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు

>
మరిన్ని వార్తలు