లాభాల్లో ప్రభుత్వ రంగ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

11 Nov, 2022 07:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది(2022–23) రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ) పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌గా జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 4% వృద్ధితో రూ. 5,229 కోట్లను అధిగమించింది. ఇది ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 5,023 కోట్లు ఆర్జించింది.

ఆదాయం రూ. 19,283 కోట్ల నుంచి రూ. 19,344 కోట్లకు బలపడింది. షేరుకి రూ. 3 చొప్పున రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఈ కాలంలో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 5.17% నుంచి 4.38%కి, నికర ఎన్‌పీఏలు 1.72% నుంచి 1.27%కి తగ్గాయి. 
ఫలితాల నేపథ్యంలో పీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.3 శాతం క్షీణించి రూ. 117 వద్ద ముగిసింది.
 

మరిన్ని వార్తలు