ఫోన్‌పే కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. క్షణాల్లో డెలివరీ పేమెంట్ చెల్లింపు

5 Jul, 2021 20:34 IST|Sakshi

డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే, ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పే-ఆన్-డెలివరీ ఆర్డర్ల కోసం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా "క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకున్న వినియోగదారులు ప్రొడక్ట్ డెలివరీ సమయంలో ఫోన్ పే యుపీఐ ద్వారా డిజిటల్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది" అని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో యూజర్ల వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఫోన్ పే బిజినెస్ డైరెక్టర్ అంకిత్ గౌర్ మాట్లాడుతూ.. "డిజిటల్ చెల్లింపుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా యుపీఐ యాప్స్ను విస్తృతంగా వినియోగిస్తున్నందుకు ధన్యవాదాలు. డెలివరీ సమయంలో కొంతమంది కస్టమర్లు క్యాష్ ఆన్ డెలివరీ చేయడంతో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ నగదు ఆధారిత చెల్లింపులను డిజిటైజ్ చేయడం కేవలం ఈ-కామర్స్కు మాత్రమే కాకుండా డిజిటల్ ఇండియా పెద్ద లక్ష్యానికి దోహదపడుతుంది" అని అన్నారు. ఈ ఒప్పందం వల్ల ఫ్లిప్‌కార్ట్‌ క్యాష్ ఆన్ డెలివరీ సమయంలో కాంటాక్ట్ లెస్ పేమెంట్లు చేయడం కొరకు కస్టమర్లు ఫోన్ పే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది కస్టమర్లు తమ అవసరాల కోసం ఆన్‌లైన్ షాపింగ్‌కు మారారని, పే ఆన్ డెలివరీ ఎంచుకునే కస్టమర్లకు పేమెంట్ సమయంలో మనశ్శాంతితో ఇకనుంచి పేమెంట్స్ చేయొచ్చని ఫ్లిప్‌కార్ట్‌లో ఫిన్‌టెక్ అండ్ గ్రూప్ హెడ్ రంజిత్ బోయనపల్లి అన్నారు.


 

మరిన్ని వార్తలు