అశ్లీల వీడియోలకు పరోక్ష కారణం?.. ఎఫ్బీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

11 Sep, 2021 08:54 IST|Sakshi

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు భారత్‌లో భారీ షాక్‌ తగిలింది. న్యూడిటీని, ఫేక్‌ అశ్లీల వీడియోలను ప్రమోట్‌ చేస్తూ పరోక్షంగా ఎంతో మందిని మానసిక క్షోభకు గురి చేస్తోందని ఆరోపిస్తూ ఓ బాధితుడు ఉత్తరాఖండ్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం(పిల్‌)  దాఖలు చేశాడు. ఈ పిల్‌ ఆధారంగా ఫేస్‌బుక్‌తో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. 


ఫేస్‌బుక్‌ ఐడీలను హ్యాక్‌ చేయడంతో పాటు ఫేక్‌ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ ద్వారా ఇతర యూజర్ల ఫొటోలు, వీడియోల్ని సంపాదిస్తున్నారని.. వాటి సాయంతో అశ్లీల కంటెంట్‌ తయారుచేస్తున్నారని ఉత్తరాఖండ్‌కు సదరు బాధితుడు/అడ్వొకేట్‌ పోలీసులను ఆశ్రయించాడు.  అలాంటి వీడియో ఒకటి తనదాకా వచ్చిందని, భారీ ఎత్తున్న సొమ్ము కోసం బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ సదరు బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై హరిద్వారా్‌ ఎస్‌ఎస్‌పీ, డీజీపీలతో పాటు హోం సెక్రటరీకి సైతం ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆర్టీఐ చట్టం ద్వారా స్టేటస్‌ కోసం ప్రయత్నించగా.. తనలాంటి 45 ఫిర్యాదులు ఉన్నాయని గుర్తించాడాయన.
 

దీంతో వాటి ఆధారంగా ఉత్తరాఖండ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశాడు.  చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ వర్మ్‌ల ధర్మాసనం ఈ వాజ్యంపై  విచారణ చేపట్టింది. బాధితుడి వాదనలు విన్న న్యాయస్థానం..   ఫేస్‌బుక్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ పిల్‌పై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.  అంతేకాదు ఉత్తరాఖండ్‌ డీజీపీ, హరిద్వార్‌ అదనపు ఎస్పీలకు బెంచ్‌ నోటీసులు పంపింది. కొత్త ఐటీ చట్టాల నేపథ్యంలో అశ్లీల కంటెంట్‌ కట్టడి, యూజర్‌ ప్రైవసీని పరిరక్షించే విషయంలో ట్విటర్‌, ఫేస్‌బుక్‌లు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందంటూ ధర్మాసనం వాదనల సందర్భంగా వ్యాఖ్యానించడం విశేషం.

చదవండి: కళ్లజోడుతోనే కాల్స్‌, ఫొటో వీడియోలు

>
మరిన్ని వార్తలు