ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్‌ ఆగ్రహం

22 Mar, 2023 16:29 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ఇటీవలికాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండటం  ఆందోళన రేపుతోంది. ఈ నేపథ్యంలోదాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగులకు జుకర్‌బర్గ్ అంతర్గత ఇమెయిల్ ఆన్‌ లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ 2010లో  ఉద్యోగులకు  రాసిన ఈమెయిల్‌ తాజాగా (మంగళవారం. మార్చి 21) లీక్‌ అయింది.

తాజా నివేదికల ప్రకారం ఫేస్‌బుక్ సొంత మొబైల్ ఫోన్‌లో పనిచేస్తోందని టెక్ క్రంచ్ కథనానికి ప్రతిస్పందనగా 2010 ఇమెయిల్ పంపించారు.  ఈ వార‍్తను ఖండిస్తూ సిబ్బందిపై జుకర్‌ బర్గ్‌ తీవ్ర ఆగ్రహం  వ్యక్తం  చేశారు.  తన  నెట్‌వర్క్ భవిష్యత్తు ప్రణాళికల గురించి  తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి  కంపెనీ రహస్యంగా ఫోన్‌ను నిర్మిస్తోందన్న టెక్ క్రంచ్ కథనంపై అసహనం వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా నమ్మక ద్రోహమే.. ఈ పని ఎవరు చేశారో దయచేసి తక్షణమే రాజీనామా చేయండి అని  జుకర్‌బర్గ్  మండిపడ్డారు. 

2010, సెప్టెంబరులో నాటి ఈ ఇ-మెయిల్‌ "కాన్ఫిడెన్షియల్-డోంట్ షేర్" అనే లైన్‌తో మొదలవుతుంది. ఒక ప్రశ్నోత్తరాల సమయంలో తాను ఫోన్‌ తయారీ గురించి అస్సలు మాట్లాడలేదని, అన్ని ఫోన్లు, యాప్స్‌ మరింత సోషల్‌ కావడం, భవిష్యత్తు ప్రణాళికలపై మాత్రమే సుదీర్ఘంగా మాట్లాడాను అంటూ టెక్ క్రంచ్  కథనాన్ని కోట్‌ చేశారు. ఈ విషయాన్ని ఎవరు లీక్ చేసినా వెంటనే రాజీనామా చేయాల్సిందేనంటూ ఆగ్రహించారు. సంస్థ అంతర్గత సమాచారాన్ని లీక్ చేసిన వారు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి.. లేదంటే అదెవరో ఖచ్చితంగా తెలుసుకుంటామని జుకర్‌బర్గ్ హెచ్చరించారు.

కాగా గత ఏడాదంతా మెటాకు ఎదురు దెబ్బతగిలింది. ప్రతికూల ఆర్థిక వాతావరణామాలు, ఆదాయాలు పడిపోవడంతో వేలాదిమందిని తొలగించింది. అంతేకాదు మిడిల్ మేనేజ్‌మెంట్‌ను లక్ష్యంగా రాబోయే నెలల్లో 10వేల మందిని మెటా తొలగిస్తుందని, అలాగ 5 వేల ఇతర జాబ్స్‌ను కూడా భర్తీ చేయడంలేదని మార్చి  నెల ప్రారంభంలో  జుకర్‌బర్గ్‌ ఉద్యోగులకు ఇమెయిల్‌ సమాచారాన్ని అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు