ప్రైవేటీకరణపై ప్రధాని కీలక సమావేశం

9 Mar, 2022 08:37 IST|Sakshi

అంతర్జాతీయ ఇన్వెస్టర్లతో నేడు ప్రధాని భేటీ 

ప్రైవేటీకరణ, అసెట్‌ మానిటైజేషన్‌ వ్యూహాలపై చర్చ  

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అసెట్‌ మానిటైజేషన్‌ వ్యూహాలు, దేశ వృద్ధిలో వాటి పాత్ర తదితర అంశాల గురించి చర్చించేందుకు ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ 2022 మార్చి 9న సమావేశం కానున్నారు. ఉత్తర అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియా, ఆ్రస్టేలియా తదితర ప్రాంతాలకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, మౌలిక రంగం .. రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు , లీగల్‌ నిపుణులు మొదలైన వారు ఈ భేటీలో పాల్గోనున్నారు.

పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం), నీతి ఆయోగ్‌ కలిసి నిర్వహిస్తున్న ఈ అత్యున్నత స్థాయి వెబినార్‌లో 22 శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు కూడా పాలుపంచుకోనున్నారు. ‘ప్రైవేటీకరణ వ్యూహాల అమలు విషయంలో ఆయా రంగాల నిపుణులు, ఇన్వెస్టర్లు, సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించాలన్నది ఈ వెబినార్‌ లక్ష్యం‘ అని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్నప్పటికీ ఆ తర్వాత రూ. 78,000 కోట్లకు సవరించింది. కానీ ఇప్పటి వరకూ రూ. 12,400 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. 

చదవండి: మోదీ సర్కార్‌ అనుకున్నదొకటి.. అయ్యిందొకటి!

మరిన్ని వార్తలు