‘పెట్టుబడులకు ఆకర్శణీమైన గమ్యస్థానంగా భారత్‌’

12 Jan, 2023 08:37 IST|Sakshi

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో మోదీ

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే సత్తా మనకే అధికం

గత ఎనిమిదేళ్లలో సంస్కరణల వేగం మరింత పెంచాం

ఇండోర్‌: ప్రపంచ వాణిజ్యంలో భారత్‌ను ఒక వేగుచుక్కగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) పరిగణిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆర్థిక సంక్షోభం తలెత్తితే సమర్థంగా ఎదుర్కొనే సత్తా ఇతర దేశాలకంటే భారత్‌కే అధికంగా ఉందని సాక్షాత్తూ ప్రపంచ బ్యాంక్‌ చెబుతోందని గుర్తుచేశారు. మన దేశ ప్రాథమిక ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడమే ఇందుకు కారణమని వివరించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం ప్రపంచ పెట్టుబడిదారుల 7వ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు.

గత ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సంస్కరణల వేగాన్ని మరింత పెంచిందని పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో ఎన్నో అవరోధాలను తొలగించిందని వెల్లడించారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..

నంబర్‌ వన్‌ స్థానంలో భారత్‌ ‘‘నేటి నూతన భారతదేశం ప్రైవేట్‌ రంగ బలంపై ఆధారపడుతూ వేగంగా ముందుకు సాగుతోంది. రక్షణ, గనులు, అంతరిక్షం వంటి కీలక వ్యూహాత్మక రంగాల్లో ప్రైవేట్‌ రంగం ప్రవేశానికి ద్వారాలు తెరిచాం. మల్టి మోడల్‌ మౌలిక సదుపాయాల వల్ల దేశంలో పెట్టుబడులకు అవకాశాలు భారీగా పెరిగాయి. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, యువ జనాభా అధికంగా ఉండడం, రాజకీయ స్థిరత్వం మన దేశ ప్రగతికి చోదక శక్తులు. మన బలాలే పెట్టుబడిగా సులభతర జీవనం, సులభతర వాణిజ్యాన్ని పెంపొందించడానికి త్వరితంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. 5జీ నెట్‌వర్క్‌ను విస్తరింపజేస్తున్నాం. ఆప్టికల్‌ ఫైబర్‌ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరుకుంటోంది. ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ డేటా వినియోగంలో భారత్‌ నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది.

రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్శించింది. అది ప్రతి భారతీయుడి ఆశయం అభివృద్ధి చెందిన దేశ నిర్మాణంలో మధ్యప్రదేశ్‌ పాత్ర చాలా కీలకంగా మారింది. ఆధ్యాత్మికం, టూరిజం, వ్యవసాయం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తోంది. పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. పెట్టుబడిదారులకు తగిన ప్రతిఫలం అందించడంలో మధ్యప్రదేశ్‌ రెండు అడుగులు ముందే ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. అభివృద్ధి చెందిన భారత్‌ అనేది కేవలం నోటిమాట కాదు, ప్రతి భారతీయుడి ఆశయం. కోవిడ్‌–19 వ్యాప్తి సమయంలోనూ సంస్కరణలను ఆపలేదు. 2014 నుంచి ‘సంస్కరణ, మార్పు, నిర్వహణ’ అనే మార్గంలో భారత్‌ ముందుకు సాగుతోంది.

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ వల్ల దేశంలో అభివృద్ధి వేగం పుంజుకుంది. పెట్టుబడులకు ఆకర్షణీమైన గమ్యస్థానంగా మారింది. న్యూ ఇండియా గుర్తింపు చిహ్నాలు ‘‘జాతీయ రహదారుల నిర్మాణ వేగాన్ని ఎనిమిదేళ్లలో రెండింతలు చేశాం. ఎయిర్‌పోర్టుల సంఖ్య రెట్టింపైంది. ఓడరేవుల సామర్థ్యాన్ని, ఆదాయాన్ని ఎన్నో రెట్లు పెంచాం. సరుకు రవాణా కారిడార్లు, పారిశ్రామిక కారిడార్లు, ఆధునిక ఎక్స్‌ప్రెస్‌ రహదారులు, లాజిస్టిక్‌(సరుకు నిల్వ) పార్కులు నూతన భారతానికి గుర్తింపు చిహ్నాలుగా మారాయి. మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌ పేరిట దేశంలో తొలిసారిగా ఒక జాతీయ వేదికను ఏర్పాటు చేశాం. అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణం కోసం అంతా చేతులు కలుపుదాం. కలిసి పనిచేద్దాం. రాబోయే నాలుగైదేళ్లలో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. మోర్గాన్‌స్టాన్లీ సంస్థ ఈ మేరకు పేర్కొంది. ఇది భారతదేశ దశాబ్దం కాదు, శతాబ్దమని మెక్‌కిన్సీ సీఈఓ చెప్పారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి!

మరిన్ని వార్తలు