డొమినికాలో మెహుల్ చోక్సీ!

27 May, 2021 08:03 IST|Sakshi

న్యూఢిల్లీ: సినిమాలో లాగా స్కెచ్​ వేసి పరార్ అయిన​ ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీ ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. పీఎన్​బీ స్కామ్​ నిందితుడు, పరారీలో ఉన్న వ్యాపారి చోక్సీ కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న అంటిగ్వా పోలీసులు.. క్యూబాకు అతను పారిపోయి ఉంటాడని అంతా అనుమానించారు. అయితే.. 

ఆ అనుమానాలకు తగ్గట్లు చోక్సీ ముందుగా కరేబియన్​ ద్వీపం డొమినికాకు బోటు ద్వారా చేరుకున్నట్లు తెలుస్తోంది. 62 ఏళ్ల చోక్సీ అక్కడి నుంచి క్యూబాకు వెళ్లాలని స్కెచ్​ వేశాడు. ఈలోపు అంటిగ్వా పోలీసులు లుక్​ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో చోక్సీకి గుర్తించిన డొమినికా పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని అంటిగ్వా పోలీసులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు డొమినికా పోలీసులు మీడియాకు తెలిపారు. అయితే అంటిగ్వా మాత్రం చోక్సీ మిస్సింగ్​ను ఇంతవరకు అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం.

కాగా, పీఎన్​బీ స్కామ్​ కేసులో మెహుల్‌ చోక్సీ భారత్‌ను వీడి ఆంటిగ్వా, బార్బుడాకి పారిపోయిన విషయం తెలిసిందే. రూ.14 వేల కోట్ల కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని దేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్​తో నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు లేని క్యూబాకు చోక్సీ ప్రయత్నించి పట్టుబడ్డాడు. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వేల కోట్ల రూపాయల రుణ మోసానికి పాల్పడిన ఆరోపణలున్న చోక్సీ చివరిసారిగా ఆదివారం తన కారులో ఆంటిగ్వా, బార్బుడాలో కనిపించాడు. అయితే తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, ఈడీ అక్రమంగా భారత్​లో ఉన్న 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా చేసిందని చోక్సీ వాదిస్తున్నాడు. 

చదవండి: అర్జెంట్​గా బాత్రూం వెళ్లిన డ్రైవర్​, రైల్లో..

మరిన్ని వార్తలు