PNB Scam: సీబీఐ బిగ్‌ ఆపరేషన్‌..నీరవ్‌మోదీ ప్రధాన అనుచరుడు అరెస్ట్‌..!

12 Apr, 2022 12:21 IST|Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) స్కాం కేసులో సీబీఐ కీలక పురోగతిని సాధించింది. బ్యాంకులకు వేల కోట్ల ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ప్రధాన అనుచరుడు సుభాష్‌ శంకర్‌ను ఈజిప్టు రాజధాని కైరోలో సీబీఐ అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. సుభాష్‌ను ఈజిప్టు నుంచి భారత్‌కు తీసికొచ్చినట్లుగా సమాచారం. 

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13 వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత ఆరోపణలను నీరవ్ మోదీ ఎదుర్కొంటున్నారు. ఈ స్కామ్‌లో సుభాష్‌ శంకర్‌ కీలక నిందితుడు.  పీఎన్‌బీ స్కాంకు సంబంధించి సీబీఐ అభ్యర్థన మేరకు.. నీరవ్, అతని సోదరుడు నిషాల్ మోదీ , అతని ఉద్యోగి సుభాష్ శంకర్ పరబ్‌లపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది.

2018లో కేసు నమోదైనప్పటి నుంచి సుభాష్ శంకర్ పరారీలో ఉన్నాడు. అతడు కైరోలో అజ్ఞాతంలో దాక్కున్నాడు. తమకు అందిన ఇన్‌పుట్‌ల ఆధారంగా సీబీఐ ఆపరేషన్ నిర్వహించి శంకర్‌ని పట్టుకుంది. అతడిని ప్రత్యేక విమానంలో సీబీఐ అధికారులు.. ముంబైకి తీసుకొచ్చినట్లు సమాచారం. నేడు మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని సీబీఐ కోర్టులో శంకర్‌ను హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది. ఇక కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకుగాను సుభాష్‌ను విచారణ నిమిత్తం కస్టడీకి సీబీఐ కోరనుంది.

చదవండి: భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు