మోసపూరిత చెక్కులకు పీఎన్‌బీ చెక్‌

4 Mar, 2023 04:05 IST|Sakshi

రూ.5 లక్షలకూ ఇక పీపీఎస్‌ వ్యవస్థ  

న్యూఢిల్లీ: చెక్కులకు సంబంధించి మోసాల విషయంలో కస్టమర్లను రక్షించే చర్యలో భాగంగా  ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మరింత పటిష్ట కీలక చర్య తీసుకుంది.  రూ. 5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువైన చెక్కుల చెల్లింపులకూ ఇకపై పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌) వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఏప్రిల్‌ 5 నుంచి కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం రూ.10లక్షలు ఆపైబడిన విలువైన చెక్కుకే పీపీఎస్‌ వ్యవస్థ అందుబాటులో ఉంది. పీపీఎస్‌ వ్యవస్థను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసింది.

ఇది నిర్దిష్ట చెక్కులను జారీ చేసేటప్పుడు కస్టమర్‌లు అవసరమైన వివరాలను (ఖాతా నంబర్, చెక్‌ నంబర్, చెక్‌ ఆల్ఫా కోడ్, ఇష్యూ తేదీ, నగదు, లబ్ధిదారు పేరు) తిరిగి ధృవీకరించవలసి ఉంటుంది. బ్రాంచ్‌ ఆఫీస్, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, మొబైల్‌ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెక్‌ వివరాలను అందించడం ద్వారా కస్టమర్‌లు పీపీఎస్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.  చెక్‌ ప్రెజెంటేషన్‌కు ఒక పని రోజు ముందు ఈ వివరాలను ఆమోదించడం, లేదా వివరాలను సమర్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పీపీఎస్‌లో నమోదైన చెక్కులు మాత్రమే వివాద పరిష్కార యంత్రాంగం కిందకు వస్తాయి.

మరిన్ని వార్తలు