ప్రైవేటు బ్యాంకులకు సై

25 Feb, 2021 06:21 IST|Sakshi

ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: ఇంతకాలం ప్రభుత్వ అధికారిక లావాదేవీలు, పన్నుల వసూళ్లు తదితర వ్యాపారం ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని దిగ్గజ ప్రైవేటు బ్యాంకులకే సొంతం కాగా.. ఇకపై అన్ని ప్రైవేటు బ్యాంకులనూ ఇందుకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. పన్నుల వసూళ్లు, పెన్షన్‌ చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు పథకాల సేవలు సహా అన్ని రకాల ప్రభుత్వాల వ్యాపార లావాదేవీల నిర్వహణకు అన్ని ప్రైవేటు బ్యాంకులను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం కస్టమర్లకు సేవల పరంగా సౌకర్యాన్నిస్తుందని, పోటీని, సేవల్లో సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖా పేర్కొంది. ‘ప్రభుత్వ వ్యాపారం ప్రైవేటు బ్యాంకులు నిర్వహించే విషయమై ఉన్న ఆంక్షలను తొలగించాము. ఇప్పుడు అన్ని బ్యాంకులు పాల్గొనొచ్చు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ప్రైవేటు బ్యాంకులూ సమాన భాగస్వాములు’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్లో ట్వీట్‌ చేశారు. ఆంక్షలు తొలగించడంతో ప్రైవేటు  బ్యాంకులనూ ప్రభుత్వ వ్యాపారం, ప్రభుత్వ ఏజెన్సీ వ్యాపార నిర్వహణకు.. ప్రభుత్వరంగ బ్యాంకులతో సమానంగా గుర్తించేందుకు ఆర్‌బీఐకి అధికారాలు లభించినట్టు అయింది.

మరిన్ని వార్తలు