పీఈ, వీసీ పెట్టుబడులు డౌన్‌

14 Sep, 2022 08:47 IST|Sakshi

ముంబై: దేశీ మార్కెట్లో ప్రయివేట్‌ ఈక్విటీ(పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌(వీసీ) ఫండ్స్‌ పెట్టుబడులు భారీగా క్షీణించాయి. గత నెల(ఆగస్ట్‌)లో 80 శాతం పడిపోయి 2.2 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇవి 19 నెలల కనిష్టంకాగా.. 2021 ఆగస్ట్‌లో 11.2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు లభించినట్లు  ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నెలవారీ నివేదిక వెల్లడించింది. 

2022 జులైలో 4.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు లభించగా.. ఈ ఆగస్ట్‌లో కొత్త రికార్డ్‌ నెలకొల్పుతూ 3.1 బిలియన్‌ డాలర్ల విలువైన అమ్మకాలు నమోదైనట్లు తెలియజేసింది. నివేదిక ప్రకారం గత నెలలో 83 డీల్స్‌ ద్వారా పెట్టుబడులు లభించగా.. దేశీ కంపెనీలలో 97.2 కోట్ల డాలర్ల విలువైన ఐదు భారీ లావాదేవీలు నమోదయ్యాయి. 

హెల్త్‌కేర్‌ను మినహాయిస్తే అధిక రంగాలలో పెట్టుబడులు క్షీణించినట్లు ఈవై పార్టనర్‌ వివేక్‌ సోనీ పేర్కొన్నారు. హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు 485 శాతం జంప్‌చేయగా.. 3.1 బిలియన్‌ డాలర్ల విలువైన 25 ఎగ్జిట్‌ డీల్స్‌ జరిగినట్లు నివేదిక వివరించింది. జులైలో 32.2 కోట్ల డాలర్ల విలువైన 9 అమ్మకపు డీల్స్‌ మాత్రమే నమోదయ్యాయి. అయితే 2021 ఆగస్ట్‌లోనూ 7.4 బిలియన్‌ డాలర్ల విలువైన 42 లావాదేవీలు నమోదుకావడం గమనార్హం!    

మరిన్ని వార్తలు