Russia Ukraine War: భారత్‌పై ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!

17 Mar, 2022 14:00 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ ప్రభావం భారత్‌ నుంచి కొన్ని ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్రంగా ఉంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ లోక్‌లోభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఫార్మా సూటికల్స్, టెలికం పరికరాలు, టీ, కాఫీ, సముద్ర ఉత్పత్తులపై ఈ ప్రభావం ఉంటుందని పరిశ్రమల నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోందని  అన్నారు. ఇంకా ఆయన పేర్కొన్న అంశాలు ఏమిటంటే... 

► యుద్ధం వల్ల దేశంలో కూడా కొన్ని నిత్యావసర వస్తువుల సరఫరాలకు విఘాతం ఏర్పడే పరిస్థితి ఉంది. సమస్య నుంచి బయటపడ్డానికి సంబంధిత వర్గాలపై నిరంతరం సంప్రదింపులు నిర్వహిస్తున్నాం.  సన్‌ఫ్లవర్‌ సహా వంటనూనెల సరఫరాలు తగిన విధంగా ఉండడం, ధరల కట్డడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 
 
► యుద్ధానంతర పరిస్థితిపై ఇప్పుడే మరింత ఖచ్చితమైన అంచనాలకు రాలేం. ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. సవాలు అంచనాకు ప్రస్తుతం ఈ అనిశ్చితి తొలగిపోయి, పరిస్థితి స్థిరపడాల్సి ఉంటుంది.  

► భారతదేశం నుండి రష్యాకు ఎగుమతి చేసే ప్రధాన వస్తువుల్లో ఫార్మాస్యూటికల్స్, టెలికం సాధనాలు, ఇనుము, ఉక్కు, టీ, రసాయనాలు ఉన్నాయి. అయితే దిగుమతులలో పెట్రోలియం, ముత్యాలు, పాక్షిక విలువైన రాళ్లు, బొగ్గు, ఎరువులు, వంట నూనెలు ఉన్నాయి.  

► ఉక్రెయిన్‌కు భారతదేశం ఎగుమతులలో ఫార్మాస్యూటికల్స్, టెలికం సాధనాలు, వేరుశెనగ, సిరామిక్, ఇనుము, ఉక్కు ఉన్నాయి. దిగుమతుల్లో వంట నూనెలు, ఎరువులు, ఇన్‌కార్బానిక్‌ రసాయనాలు, ప్లాస్టిక్, ప్లైవుడ్, దాని అనుబంధ ఉత్పత్తులు ఉన్నాయి. 

► కొత్త విదేశీ వాణిజ్య విధానాన్ని (ఎఫ్‌టీపీ) రూపొందించడానికి సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా సంబంధిత వర్గాలతో పలు సమావేశాల నిర్వహణ జరిగింది. వారి సూచనలు, సలహాలను పూర్తి స్థాయిలో కేంద్రం పరిశీలిస్తుంది.  

► భారత్‌ 2021–22లో 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్సి సాధిస్తుంది. 

► 2021 ఏప్రిల్‌–జనవరి 2022 మధ్య వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు (పాడి, పాల ఉత్పత్తులతో సహా) 25 శాతంపైగా వృద్ధితో  40.87 బిలియన్లకు పెరిగాయి.  

► రబ్బర్‌ పరిశ్రమ పురోగతికి చట్ట సవరణ.

చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనుగోలు దారులకు నితిన్‌ గడ‍్కరీ శుభవార్త!

మరిన్ని వార్తలు