దేశంలో ఇళ్ల ధరలు పెరిగాయ్‌

22 Jun, 2021 08:56 IST|Sakshi

ముంబై: దేశంలోని పది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు 2020–21 జనవరి–మార్చి త్రైమాసికంలో సగటున స్వల్పంగా పెరిగాయి. అఖిల భారత గృహ ధరల సూచీ (హెచ్‌పీఐ) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 2.7 శాతం పెరిగినట్లు (2019–20 ఇదే త్రైమాసికంతో పోల్చి) సోమ వారం విడుదలైన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి.

పది ప్రధాన నగరాల హౌసింగ్‌ రిజిస్ట్రేషన్‌ అథారిటీల నుంచి అందిన గణాంకాల ప్రాతిపదికన ఆర్‌బీఐ ఈ త్రైమాసిక హెచ్‌పీఐని విడుదల చేస్తుంది. ఈ నగరాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, జైపూర్, కాన్పూర్, కోచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై ఉన్నాయి.  నగరాలను వేర్వేరుగా చూస్తే, 15.7 శాతం పెరుగుదలతో బెంగళూరు టాప్‌లో ఉంది. అయితే జైపూర్‌లో ధరలు 3.6 శాతం తగ్గాయి. కాగా 2020–21 ఇదే త్రైమాసికంలో ఆల్‌ ఇండియా హెచ్‌పీఐ 3.9 శాతంగా ఉంది.  ఇదిలావుండగా, 2020–21 క్యూ3తో పోల్చితే (అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌) క్యూ4లో ఆల్‌ ఇండియా హెచ్‌పీఐ వృద్ధి రేటు స్వల్పంగా 0.2 శాతం పెరిగింది. త్రైమాసికపరంగా ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్‌లలో ధరలు తగ్గితే, మిగిలిన ఆరు పట్టణాల్లో పెరిగాయి.

మరిన్ని వార్తలు