మందుబాబులకు గుడ్‌ న్యూస్‌, భారీగా తగ్గనున్న ధరలు

9 Jun, 2022 18:47 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్ రాష్ట్రం మద్యం బాబులకు గుడ్‌ న్యూస్‌ చప్పింది. పంజాబ్‌లోని ఆమ్ఆద్మీ  సర్కార్‌ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్  ఆమోదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగాఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది.  ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. 

పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్‌ సర్కార్‌ మద్యం పాలసీని తీసుకురావడమేకాదు, కొన్నినిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడంద్వారా వేలం వేయనుంది. అలాగే డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది.

అంతేకాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ (పిఎంఎల్) మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరల తగ్గుదలతో ఎక్సైజ్ ఆదాయాన్ని 40 శాతం పెంచుకోవాలని భావిస్తోంది.  ఈ  పాలసీ తొమ్మిది నెలల పాటు  2023, 31 మార్చి వరకు అమల్లో ఉంటుంది.

మద్యం కల్తీ, స్మగ్లింగ్‌, అక్రమ డిస్టిలరీలను అరికట్టేందుకు డిపార్ట్‌మెంట్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం తెలిపారు. ఇందుకోసం పోలీసు శాఖకు రెండు అదనపు బెటాలియన్లు కేటాయించనున్నామన్నారు. ఫలితంగా హర్యానా కంటే10-15 శాతం తక్కువగా ధరలు ఉండ నున్నాయి.  కొన్ని బ్రాండ్‌ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా వాడే ఇండియన్  ఐఎంఎఫ్‌ఎల్‌ ధర కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్‌లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు దిగిరానుంది.

మరిన్ని వార్తలు