రైట్స్‌తో పీవీఆర్‌- బైబ్యాక్‌తో ఎంపీఎస్‌.. స్పీడ్‌

12 Aug, 2020 14:48 IST|Sakshi

రైట్స్‌ ఇష్యూకి అధిక స్పందన

6.5 శాతం జంప్‌చేసిన పీవీఆర్‌ షేరు

ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఓకే

ఎంపీఎస్‌- 5 శాతం అప్పర్ సర్క్యూట్‌

నిధుల సమీకరణకు చేపట్టిన రైట్స్‌ ఇష్యూ ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన వార్తలతో మల్టీప్లెక్స్‌ చైన్‌ కంపెనీ పీవీఆర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించడంతో పబ్లిషింగ్‌ సొల్యూషన్స్‌ అందించే ఎంపీఎస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

పీవీఆర్‌ లిమిటెడ్
గత నెల 17-31 మధ్య చేపట్టిన రైట్స్‌ ఇష్యూకి 2.24 రెట్లు అధికంగా స్పందన లభించినట్లు పీవీఆర్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. షేరుకి రూ. 784 ధరలో నిర్వహించిన రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్లు సమీకరించినట్లు తెలియజేసింది. రైట్స్‌లో ఆఫర్‌ చేసిన 38.23 కోట్ల షేర్లకుగాను 85.29 లక్షల షేర్ల కోసం దరఖాస్తులు లభించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పీవీఆర్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.4 శాతం జంప్‌చేసి రూ. 1,194 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1,229 వరకూ ఎగసింది.

ఎంపీఎస్‌ లిమిటెడ్‌
ఒక్కో షేరు రూ. 600 ధర మించకుండా బైబ్యాక్‌ చేపట్టేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఎంపీఎస్‌ లిమిటెడ్‌ తెలియజేసింది. కంపెనీ ఈక్విటీలో 3.04 శాతం వాటాకు సమానమైన దాదాపు 5.67 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు రూ. 34 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. పబ్లిషింగ్‌ సంబంధ సొల్యూషన్లు అందించే కంపెనీలో ప్రమోటర్ల వాటా జూన్‌కల్లా 67.77 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీఎస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 415 సమీపంలో ఫ్రీజయ్యింది.

మరిన్ని వార్తలు