పీసీ మార్కెట్‌కు కలిసిరాని క్యూ2

12 Aug, 2020 07:58 IST|Sakshi

డెస్క్‌టాప్‌ పీసీలకు తగ్గిన గిరాకీ 

నోట్‌బుక్‌ విక్రయాల్లో 17.6% వృద్ధి 

భారతీయ పీసీ మార్కెట్‌కు క్యూ2 పెద్దగా కలిసిరాలేదు. ఈ జూన్‌ త్రైమాసికంలో పీసీ మార్కెట్లో భాగమైన డెస్క్‌టాప్స్, నోట్‌బుక్స్, వర్క్‌స్టేషన్స్‌లు మొత్తం కలిపి 21లక్షల యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే క్యూ2లో 33లక్షల యూనిట్ల విక్రయాలతో పోలిస్తే 37.3% క్షీణతను చవిచూసినట్లు ఐడీసీ గణాంకాలు తెలిపాయి. ఈ త్రైమాసికంలో డెస్క్‌టాప్‌ పీసీలకు డిమాండ్‌ తగ్గడంతో అమ్మకాల్లో 46% పతనాన్ని చవిచూశాయి. (చదవండి : ఇంట్లోనే ఆఫీస్‌ సెటప్‌!)

కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో పీసీమార్కెట్‌ కేవలం 45రోజులు మాత్రమే పనిచేసింది. ఫలితంగా ఈ క్వార్టర్‌లో వినియోగదారుల విభాగంలో తక్కువ అమ్మకాలు జరిగినట్లు ఐడీసీ తెలిపింది. కరోనా వ్యాప్తి భయాలతో కంపెనీలు వర్క్‌ఫ్రమ్‌హోమ్‌కు ప్రాధాన్యతను నిచ్చాయని, దీంతో నోట్‌బుక్‌లకు బలమైన డిమాండ్‌ ఏర్పడంతో అమ్మకాల్లో 17.6% వృద్ధి పెరిగిందని ఐడీసీ తెలిపింది.  

లెనోవా కంపెనీ గత 5ఏళ్లలో అత్యధిక విక్రయాలు ఈ క్వార్టర్‌లో నమోదుచేసింది. ఎలక్ట్రానిక్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ తమిళనాడుతో కుదుర్చుకున్న భారీ డీల్‌లో భాగంగా విక్రయాలు పెరిగినట్లు ఐడీసీ తెలిపింది. సప్లై, రవాణా సవాళ్లున్నప్పటికీ క్వార్టర్‌ తొలిభాగంలో కంపెనీలు పెద్దమొత్తంలో ఆర్డర్లనునిచ్చాయి. వర్క్‌ ఫ్రమ్‌హోమ్‌లో భాగంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు తొలిసారి నోట్‌బుక్స్‌ టెక్నాలజీని పరిచయం చేశాయి. దీర్ఘకాలంలో నోట్‌బుక్‌ కంపెనీలకు ఇదే డిమాండ్‌ ఉండే అవకాశం ఉందని ఐడీసీ వెల్లడించింది.

మరిన్ని వార్తలు