కరోనా సంక్షోభంపై రాజన్‌ విశ్లేషణ..

7 Sep, 2020 19:11 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్ ‌రాజన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ జూన్ త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 23.9 శాతం క్షణించడంపై ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అధికార యంత్రాంగం కీలక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాజన్‌ చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కరోనాను నివారించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుందని, కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సరిపోదని అభిపప్రాయపడ్డారు. అయితే దేశ వృద్ధి రేటు మెరుగవ్వాలంటే యువత ఆశయాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని తెలిపారు.

అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కార్మిక రక్షణ చట్టాలను రద్దు చేయడం ద్వారా పరిశ్రమ, ఉద్యోగులలో చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో దేశ ఎగుమతులు వృద్ధి చెందే అవకాశం లేదు. ఎందుకంటే భారత్‌ కంటే ముందే ప్రపంచం కోలుకుంటుందని తెలిపారు. మరోవైపు చిన్న కార్పొరేషన్లు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నిధులను వేగంగా సమకూర్చాలని పేర్కొన్నారు . బాండ్‌ మార్కెట్ల ద్వారా ప్రభుత్వం నిధులను సమకూర్చుకొని అవసరమైన రంగాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

అయితే మెట్రో నగరాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల అమ్మకంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వ్యాపార సం‍స్థలకు లీజుకు ఇవ్వాలని తెలిపారు. కరోనా సంక్షోభంలో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(ఎమ్‌ఎన్‌ఆర్‌జీఏ) ద్వారా గ్రామీణ ప్రజలకు కొంత స్వాంతన కలగనుందని, కానీ మెట్రో నగరాలలో ఆదాయం లేని వారికి ఎమ్‌ఎన్‌ఆర్‌జీఏ వర్తించదు కనుక ప్రభుత్వం వారిని ఆదుకోవాలని రఘురామ్‌ రాజన్‌ కోరారు.

మరిన్ని వార్తలు