ఏసీ ఎకానమీ కోచ్‌.. ఛార్జీ తక్కువ సౌకర్యాలు ఎక్కువ

28 Aug, 2021 19:57 IST|Sakshi

సరికొత్త బిజినెస్‌ పాఠాలతో లాలు ప్రసాద్‌ యాదవ్‌ రైల్వేను పరుగులు పెట్టించారు. మట్టిపాత్రల్లో టీలు, ఎక్స్‌ట్రా బెర్తులతో పాటు పేదల కోసం ప్రత్యేకంగా గరీబ్‌రథ్‌ పేరుతో ఏసీ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సామాన్యులకు ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేవడం కోసం ఏసీ ఎకానమీ కోచ్‌లను రైల్వేశాఖ అందుబాటులోకి తెచ్చింది. 

ఏసీ ఎకానమీ కోచ్‌లు
ప్రస్తుతం రైల్వేలో ఏసీ ఫస్ట్‌క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌, థర్డ్‌ క్లాస్‌ కేటగిరీలు ఉన్నాయి. వీటితో పాటు గరీబ్‌రథ్‌ ఏసీ రైళ్లు, కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏసీ చెయిర్‌కార్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏసీ చెయిర్‌ కార్‌, థర్డ్‌ క్లాస్‌ ఏసీల టిక్కెట్‌ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాటికంటే తక్కువ ధరకే ఏసీ ప్రయాణం అందుబాటులోకి తేనుంది రైల్వే శాఖ. దీనికి ఏసీ ఎకానమీ కోచ్‌లుగా పేరు పెట్టింది. 

ధర ఎంతంటే
ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో ఏసీ థర్డ్‌ క్లాస్‌ టిక్కెట్‌ ఛార్జీల కంటే 8 శాతం తక్కువగా వీటికి ఛార్జీలుగా నిర్ణయించారు. దీని ప్రకారం స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్‌ బేస్‌ ఫేర్‌  కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర చెల్లించి ఏసీ ప్రయాణం చేయడం వీలవుతుంది. ఈ కోచ్‌లలో కనీస ఛార్జీ రూ. 440గా నిర్ణయించారు.

తొలి ట్రైన్‌ ఇక్కడే
అందులో నార్త్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌ మొదటి కోచ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2021 సెప్టెంబరు 6న ప్రయాగ్‌రాజ్‌ నుంచి జైపూర్‌కి వెళ్లే రైలులో ఈ కోచ్‌ను తొలిసారిగా ప్రవేశ పెడుతున్నారు.  దీనికి సంబంధించిన బుకింగ్స్‌ మొదలయ్యాయి.

సౌకర్యాలు సూపర్‌
వివిధ కోచ్‌ ఫ్యాక్టరీలో ఇప్పటికే 50కి పైగా ఏసీ ఎకానమీ కోచ్‌లు తయారై రెడీగా ఉన్నాయి,. వీటిని వివిధ జోన్లకు కేటాయించారు. వీటిని లింకే హఫ్‌మన్‌ బుష్‌ టెక్నాలజీతో తయారు చేశారు. ఇంటీరియర్‌ మొత్తం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏసీ కోచ్‌ల కంటే ఎకానమీ కోచ్‌లలో సౌకర్యాలు బాగున్నాయి,

మన దగ్గర ఎప్పుడు
ఏసీ ఎకామని కోచ్‌లు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రవేశపెడతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. తొలి విడత కేటాయింపులో దక్షిణ మధ్య రైల్వేకు ఈ కోచ్‌లు కేటాయిస్తే అతి త్వరలోనే ఈ సౌకర్యం తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సాధారణంగా ఈ ఏసీ ఎకానమీ కోచ్‌లను రెండు జోన్ల మధ్య తిరిగే రైళ్లలో ఎక్కువగా ప్రవేశ పెడుతున్నారు. 

చదవండి : కరోనా’తో ఆన్‌లైన్‌ వ్యసనం!..సర్వేలో భయంకర నిజాలు

మరిన్ని వార్తలు