స్టాక్‌ మార్కెట్‌లోకి రెయిన్‌బో ఎంట్రీ

22 Apr, 2022 08:52 IST|Sakshi

27న రెయిన్‌బో హాస్పిటల్‌ ఐపీవో

రూ. 2,000 కోట్ల సమీకరణ 

న్యూఢిల్లీ: మల్టీ స్పెషాలిటీ పిల్లల హాస్పిటల్‌ చెయిన్‌ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో) ఏప్రిల్‌ 27న ప్రారంభం కానుంది. 29న ముగుస్తుంది. దీని ద్వారా సంస్థ రూ. 2,000 కోట్లు సమీకరించనున్నట్లు మార్కెట్‌ వర్గాల అంచనా. ఇష్యూలో భాగంగా రూ. 280 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ప్రస్తుత వాటాదారులు 2.4 కోట్ల వరకు షేర్లను విక్రయించనున్నారు. ప్రమోటర్లు రమేష్‌ కంచర్ల, దినేష్‌ కుమార్‌ చీర్ల, ఆదర్శ్‌ కంచర్ల.. ప్రమోటర్‌ గ్రూప్‌నకు చెందిన పద్మ కంచర్ల, అలాగే ఇన్వెస్టర్లయిన బ్రిటీష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (గతంలో సీడీసీ గ్రూప్‌), సీడీసీ ఇండియా.. ఓఎఫ్‌ఎస్‌లో వాటాలు విక్రయించనున్నారు.
 

అర్హత కలిగిన ఉద్యోగుల కోసం 3 లక్షల షేర్లను కేటాయించనున్నారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను .. గతంలో జారీ చేసిన నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్లకు ముందస్తుగా చెల్లించడం, కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయడం, వైద్య పరికరాలను కొనుగోలు చేయడం తదితర అవసరాల కోసం సంస్థ వినియోగించుకోనుంది.

చదవండి: ఐపీవో బాటలో క్యాంపస్‌ షూస్‌, గోదావరీ బయో..!

మరిన్ని వార్తలు